
- తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ర్యాలీకి సిద్ధమవుతున్న నేతలు
- ప్రజా ద్రోహాన్ని ఎండగడుదాం: భూమన
ఉమ్మడి చిత్తూరు జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలుగుదేశం–జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలపై అమలు చేస్తున్న దమనకాండ, హత్యాకాండ, అరాచక పాలనకు వ్యతిరేకంగా రేపు (4వ తేదీ) రాష్ట్రవ్యాప్తంగా వైస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ నిరసన కార్యక్రమానికి వైస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారని, ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలన్నీ సిద్ధమవుతున్నారని భూమన తెలిపారు.
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుండగా, అధిష్టానం దృష్టిలో ఈ కృషి ప్రాశస్త్యం పొందిందని ఆయన పేర్కొన్నారు.
ప్రజా మోసాలను బహిరంగం చేయాల్సిన సమయం
“ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే హామీలతో అధికారం దక్కించుకుంది.
కానీ వాస్తవానికి ఒక్క హామీని కూడా అమలు చేయకుండా, ప్రతి పదిహేను రోజులకు ఒకసారి డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా ప్రజలను మాయమాటలతో మోసం చేస్తూ, వైస్సార్సీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, కార్యకర్తలపై హత్యాకాండలకు పాల్పడడం జరుగుతోందని” భూమన మండిపడ్డారు.
ఈ పరిస్థితుల్లో ప్రజల కోసం పోరాడే పార్టీగా వైస్సార్సీపీ ముందుకు రావాల్సిన అవసరం ఉందని, పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు రక్షణ కలిగించగల శక్తి కలవారని ఆయన స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం చేసే దౌర్జన్యాలు, అరాచకాలు, ప్రజా ద్రోహాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలంతా గళమెత్తాలని పిలుపునిచ్చారు.