ఆరోగ్యశ్రీని ఖూనీ చేసే కుట్ర: వైఎస్ షర్మిల నిప్పులు!
ఆరోగ్యశ్రీని ఖూనీ చేసే కుట్ర: కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల నిప్పులు!
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త ఆరోగ్య విధానాలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ (UHC) పేరుతో పేదల సంజీవని అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆమె ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన షర్మిల, ప్రభుత్వ నిర్ణయాలు పేదలకు మేలు చేయడం కంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల జేబులు నింపడానికే అని విమర్శించారు. ఆరోగ్యశ్రీని ప్రైవేట్ పరం చేయడం అంటే పేదవాడి ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని ఆమె మండిపడ్డారు.
ఆరోగ్యశ్రీని ‘అనారోగ్యశ్రీ’గా మార్చుతున్నారు.. షర్మిల ఆగ్రహం
ప్రభుత్వం ప్రకటించిన 2.5 లక్షల ఆరోగ్య బీమా అంతా ఒక పచ్చి మోసమని షర్మిల విమర్శించారు. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అనేది కేవలం ఒక బూటకమని, దీని వెనుక ఆరోగ్యశ్రీని చంపేసే ఉద్దేశం ఉందని ఆమె దుయ్యబట్టారు. ట్రస్ట్ విధానంలో అద్భుతంగా నడుస్తున్న పథకాన్ని కావాలనే భ్రష్టు పట్టిస్తున్నారని, ఉద్దేశపూర్వకంగానే ఆరోగ్యశ్రీని ‘అనారోగ్యశ్రీ’గా మారుస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ప్రైవేట్ బీమా వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని తెలిసినా, చంద్రబాబు ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు.
ఇన్సూరెన్స్ కంపెనీలకు ఖజానా దోచిపెట్టే డ్రామాలు
వైద్యంపై ప్రభుత్వ భరోసా లేకుండా చేసి, అంతా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం దుర్మార్గమని షర్మిల పేర్కొన్నారు. రాష్ట్ర ఖజానాను ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టడమే లక్ష్యంగా ఈ కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ట్రస్ట్ విధానంలోనే పేదలకు సరైన వైద్యం అందుతుందని తెలిసినా, ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ బీమా భారం సామాన్యుల మీద పడటం ఖాయమని ఆమె హెచ్చరించారు.
బకాయిలు విడుదల చేయాలి.. పాత పద్ధతే కొనసాగించాలి
దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పేదలకు పునర్జన్మ వంటిదని షర్మిల గుర్తు చేశారు. ఎంతటి పెద్ద జబ్బు చేసినా ప్రాణాలకు భరోసా ఇచ్చే ఈ పథకాన్ని ప్రైవేట్తో లింక్ పెట్టే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీని ట్రస్ట్ విధానంలో ప్రభుత్వమే నేరుగా నడపాలని కోరారు. అలాగే ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 3,000 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
#YSSharmila #Aarogyasri #AndhraPradesh #APPolitics #Congress #HealthCare #ChandrababuNaidu #YSR #PublicHealth

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
