March 23, 2026

బంగ్లాదేశ్ చెర నుంచి విడుదల: విశాఖకు చేరుకున్న 9 మంది మత్స్యకారులు

గతేడాది అక్టోబర్‌లో వేటకు వెళ్లిన విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది మత్స్యకారులు, సముద్రంలో దారి తప్పి బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించారు. దీంతో అక్కడి కోస్ట్ గార్డ్ వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది.

పొరపాటున సరిహద్దు దాటినందుకు దాదాపు నాలుగు నెలల పాటు వీరు బంగ్లాదేశ్ జైలులో మగ్గారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దౌత్యపరమైన కృషితో వీరు విడుదలయ్యారు. ఫిబ్రవరి 2 (సోమవారం) తెల్లవారుజామున 5 గంటల సమయంలో వీరు విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్నారు. ఆర్డీవో ఎస్. సుధాకర్, ఫిషరీస్ జేడీ లక్ష్మణరావు, ఏపీ మెకనైజ్డ్ బోటు అసోసియేషన్ అధ్యక్షులు మైలపల్లి లక్ష్మణరావు తదితరులు హార్బర్‌కు చేరుకుని మత్స్యకారులను పరామర్శించి, స్వీట్లు పంపిణీ చేశారు.  జైలులో ఉన్న సమయంలో తమ కుటుంబాల పరిస్థితి తలచుకుని ఎంతో ఆందోళన చెందామని, మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరుకోవడం పునర్జన్మలా ఉందని మత్స్యకారులు భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ మత్స్యకారులందరూ విజయనగరం జిల్లా పూసపాటిరేగ మరియు ఎచ్చెర్ల మండలాలకు చెందిన వారు. వీరు విశాఖ హార్బర్ నుంచే వేటకు వెళ్లారు.

#VizagFishermen #BangladeshJailRelease #VizagHarbour #FishermenSafety #AndhraPradeshNews #InternationalBorders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *