వలసదారులకు షాక్.. ఇక నో బాండ్, నో బెయిల్!
అమెరికాలో అక్రమ వలసదారుల పట్ల డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరికి న్యాయస్థానం మద్దతు తెలిపింది. బాండ్ చెల్లించి తాత్కాలికంగా విడుదలయ్యే (ఇమ్మిగ్రేషన్ బాండ్) సదుపాయాన్ని నిరాకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఐదవ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ తీర్పునిచ్చింది. దీనివల్ల ఇకపై అమెరికాలో పట్టుబడిన వలసదారులు విచారణ ముగిసే వరకు నిర్బంధంలోనే ఉండాల్సి వస్తుంది. ఎన్నో దశాబ్దాలుగా అందుబాటులో ఉన్న బాండ్ విధానానికి ఈ రూలింగ్తో బ్రేక్ పడినట్లయింది.
రాజ్యాంగబద్ధమేనన్న న్యాయమూర్తుల ప్యానల్
హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను న్యాయమూర్తుల ప్యానల్ తోసిపుచ్చింది. బాండ్ విచారణలను నిరాకరించడం రాజ్యాంగానికి మరియు ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ చట్టానికి అనుగుణంగానే ఉందని కోర్టు స్పష్టం చేసింది. వలసదారులు అమెరికాలో ఎంత కాలంగా నివసిస్తున్నారనే అంశంతో సంబంధం లేకుండా, వారిని బాండ్పై విడుదల చేసేందుకు అనుమతించకూడదన్న ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించింది.
ఏమిటీ ఇమ్మిగ్రేషన్ బాండ్?
సాధారణంగా అక్రమ వలసల ఆరోపణలతో అరెస్టయిన వారు విచారణకు హాజరవుతామని హామీ ఇస్తూ కొంత మొత్తాన్ని పూచీకత్తుగా చెల్లించే విధానమే ఈ ‘ఇమ్మిగ్రేషన్ బాండ్’. ఇది ఒక రకమైన బెయిల్ వంటిది. నిబంధనల ప్రకారం కోర్టుకు హాజరైతే విచారణ అనంతరం ఆ సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు. అయితే, ట్రంప్ ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేస్తూ గత జూలైలో ఉత్తర్వులు జారీ చేసింది. నిర్బంధం తప్పనిసరి అని స్పష్టం చేస్తూ పాత పద్ధతులకు స్వస్తి పలికింది.
30 ఏళ్ల సంప్రదాయానికి తెర
గత మూడు దశాబ్దాలుగా అటు డెమొక్రాట్లు, ఇటు రిపబ్లికన్ ప్రభుత్వాలు ఈ బాండ్ విధానాన్ని కొనసాగిస్తూ వచ్చాయి. తాజాగా మెక్సికోకు చెందిన ఇద్దరు వ్యక్తుల కేసులో అప్పీల్స్ కోర్టు ఇచ్చిన 2-1 మెజారిటీ తీర్పుతో ట్రంప్ నిర్ణయానికి చట్టబద్ధత లభించింది. పదేళ్లకు పైగా అమెరికాలో ఉంటూ, ఎటువంటి క్రిమినల్ రికార్డు లేని వారిని కూడా నిర్బంధించే అధికారం ప్రభుత్వానికి ఉందని కోర్టు తీర్పు సారాంశం. దీంతో వేలాది మంది వలసదారుల భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
#TrumpImmigration #USA #ImmigrationBond #MigrantsRights #USCourts #InternationalNews #TeluguNews #VisaRules
