అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్ లక్ష్యంగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు; చాట్ జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సేవలు అమెరికా గడ్డపై అక్కడి విద్యుత్తును వాడుకుంటూ భారత్ వంటి దేశాలకు ఉచితంగా లేదా తక్కువ ధరకు సేవలు అందించడాన్ని ఆయన తప్పుబట్టారు. అయితే, ఈ వాదనలో నాణేనికి ఒకే పార్శ్వాన్ని చూపిస్తున్న నవారో, అమెరికన్ ఏఐ కంపెనీలు భారతీయ వినియోగదారుల నుంచి సేకరిస్తున్న విలువైన ‘డేటా’ అనే ముడిసరుకును విస్మరిస్తున్నారు.
నవారో ‘విద్యుత్’ వాదన – అంతర్లీన వాస్తవాలు
పీటర్ నవారో తన ఇంటర్వ్యూలో చాట్ జీపీటీ (ChatGPT) నిర్వహణ ఖర్చును అమెరికా భరిస్తోందని, దీనివల్ల అక్కడి గృహ వినియోగదారులకు విద్యుత్ భారమవుతోందని పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్కు ఇటువంటి అత్యాధునిక సాంకేతిక సేవలు ఎందుకు అందించాలన్నది ఆయన ప్రధాన ప్రశ్న. ట్రంప్ సలహాదారు మరో విధంగా మాట్లాడుతారని మనం ఆశించడం ఏమాత్రం మంచిదికాదు. ఏఐ డేటా సెంటర్లు భారీగా విద్యుత్తును వినియోగిస్తాయన్నది వాస్తవమే.
ఒక ఏఐ క్వెరీ (Query) సాధారణ గూగుల్ సెర్చ్ కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ విద్యుత్తును వాడుకుంటుంది. కానీ, అమెరికాలో డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల అక్కడి స్థానిక సంస్థలకు లభిస్తున్న లాభాలు, ఉద్యోగ అవకాశాలు మరియు ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఏఐ ఆధిపత్యాన్ని నవారో తన విమర్శలో ప్రస్తావించలేదు.
నవారో వ్యాఖ్యలు ఏకపక్షంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అమెరికా విద్యుత్తును వాడుతుంటే, ఆ ఏఐ మోడళ్లు శిక్షణ పొందడానికి (Training) అవసరమైన భారీ డేటాలో మెజార్టీ భాగం భారత్ వంటి దేశాల నుంచే వెళ్తోంది. గ్లోబల్ సౌత్ దేశాల నుంచి సేకరిస్తున్న సమాచారం ఆధారంగానే ఈ చాట్ బాట్లు తమ తెలివితేటలను మెరుగుపరుచుకుంటున్నాయి.
అంటే, అమెరికా ‘పవర్’ ఇస్తుంటే, భారత్ ‘నాలెడ్జ్’ (డేటా) ఇస్తోంది. ఈ డేటా సేకరణ వల్ల భారత్ వంటి దేశాల ‘డేటా సార్వభౌమాధికారం’ (Data Sovereignty) దెబ్బతింటోందని ఇప్పటికే అనేక ఫిర్యాదులు ఉన్నాయి. భారతీయ వినియోగదారుల ప్రైవేట్ సమాచారాన్ని అమెరికన్ సర్వర్లలో నిక్షిప్తం చేయడం ద్వారా ఆ కంపెనీలు బిలియన్ల డాలర్ల లాభాలను గడిస్తున్నాయి.
భారత్ లక్ష్యంగా ఆంక్షల పర్వం
నవారో విమర్శలు కేవలం ఏఐకి మాత్రమే పరిమితం కాలేదు. గతంలో భారత్ను “మహారాజా ఆఫ్ టారిఫ్స్” (సుంకాల మహారాజు) అని సంబోధించిన ఆయన, ఇప్పుడు రష్యా చమురు కొనుగోలును సాకుగా చూపి భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 50 శాతం వరకు సుంకాలు విధించడాన్ని సమర్థించుకుంటున్నారు.
రష్యాతో భారత్ బంధం కేవలం ఇంధన భద్రత కోసమేనని ఢిల్లీ ఎన్నిసార్లు స్పష్టం చేసినా, వాషింగ్టన్ మాత్రం దీనిని ఒక రాజకీయ అస్త్రంగా వాడుతోంది. అలాగే అమెరికాలో వ్యవసాయ భూముల కొనుగోలుపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా విదేశీ పెట్టుబడులను నియంత్రించే వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది.
మరోవైపు, ఏఐ రంగంలో భారత్ ఇప్పుడు ‘ఆత్మనిర్భర్’ బాటలో పయనిస్తోంది. ‘భాషిణి’ వంటి స్వదేశీ ఏఐ ప్రాజెక్టుల ద్వారా స్థానిక భాషల్లో సేవలు అందించడంపై దృష్టి పెట్టింది.
నవారో వంటి వారు విద్యుత్ వినియోగాన్ని సాకుగా చూపి రేపు ఏఐ సేవలకు భారీగా ధరలు పెంచడం లేదా నియంత్రించడం చేస్తే, అది భారత్కు తన సొంత ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవడానికి ఒక బలమైన ప్రేరణగా మారుతుంది. ఏఐ అనేది కేవలం ఒక సర్వీస్ మాత్రమే కాదు, అది ఒక దేశం యొక్క మేధో సంపత్తితో ముడిపడి ఉన్న అంశం. కాబట్టి, అమెరికా విద్యుత్ కంటే భారత్ అందిస్తున్న ‘హ్యూమన్ డేటా’ విలువ ఎంతో ఎక్కువని గమనించాల్సి ఉంది.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.
మన ఇండియా చేసిన సేవలను.. అమెరికా మరిచి పోతుంది… సార్. 🙏 అన్ని దేశాలకన్నా. మనది.”హ్యూమన్ ” ఎత్తిక్స్.. వున్నా దేశం…