పెద్దపులి సంచారం: అప్రమత్తంగా ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ సూచన
మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి దుర్గేష్ జిల్లా అటవీ శాఖ అధికారులతో ఫోన్ ద్వారా తాజా పరిస్థితిని సమీక్షించారు. రాజానగరం, తొర్రేడు, సీతానగరం సమీపంలో పులి కదలికలను ట్రాక్ కెమెరాలు, డ్రోన్ల సహాయంతో పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. పులిని బంధించేందుకు ఇప్పటికే పలు చోట్ల బోన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రజలకు మంత్రి కీలక సూచనలు
పులి పట్టుబడే వరకు ప్రజలు వ్యక్తిగత భద్రత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కోరారు. వ్యవసాయ క్షేత్రాలకు లేదా నిర్మానుష్య ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకూడదు. రాత్రి సమయాల్లో పశువుల పాకలు, ఇంటి ఆవరణలో ఎక్కువ కాంతినిచ్చే విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసుకోవాలి. పులి సంచారమున్న ప్రాంతాల్లో అటవీ శాఖ వెంటనే హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో పులి సంచరించిన దాఖలాలు ఉన్నాయని, కాబట్టి అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రభుత్వ భరోసా:
అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారని, వీలైనంత త్వరగా పులిని పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ప్రజలు సమాచారాన్ని అధికారులకు అందిస్తూ సహకరించాలని కోరారు.
#EastGodavari #TigerSighting #KandulaDurgesh #ForestDepartment #PublicSafety #AndhraPradesh #BreakingNews
