
కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదుల కోసం గాలింపు
జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదులతో కాల్పుల అనంతరం భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. షింగ్పోరా ప్రాంతంలోని చత్రూ అడవుల్లో ఉగ్రవాదుల స్థితి సమాచారం మేరకు గాలింపు చర్యలు ప్రారంభించిన భద్రతా బలగాలకు అనుమానిత ఉగ్రవాదులతో తుపాకీ కాల్పులు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం చత్రూ ప్రాంతంలో పోలీసులతో కలిసి కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు తారాసపడ్డారని వైట్ నైట్ కార్ప్స్ తన X (మాజీ Twitter)లో వెల్లడించింది.
ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు ఎదురుపడడంతో కాల్పులు జరిగాయి. వెంటనే అధికారులు ఆ ప్రాంతానికి అదనపు బలగాలను మోహరించారు. స్థానికుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, ఆ ప్రాంతంలో ఇద్దరు నుండి ముగ్గురు ఉగ్రవాదులు తలదాచుకుని ఉన్నట్టు నమ్ముతున్నారు. మరోవైపు సమీప గ్రామాల్లోని జనంలో భయం నెలకొంది. భద్రతా బలగాలు సమీప గ్రామాల్లో అప్రమత్తంగా మోహరించారు. కూంబింగ్ కొనసాగుతోంది.