
- ప్రభుత్వం భారీ ఏర్పాట్లు
తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. జూన్ 2న జరిగే వేడుకల్లో భాగంగా వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో మంత్రులు జెండా ఆవిష్కరణలో పాల్గొననున్నారు. హనుమకొండలో మంత్రి కొండా సురేఖ, వరంగల్ పట్టణంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ములుగు జిల్లాలో మంత్రి సీతక్క, మహబూబాబాద్లో విప్ రాంచంద్రనాయక్, భూపాలపల్లిలో అటవీ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ పొదెం వీరయ్య, జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య జెండా ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
పాలకుర్తిలో విగ్రహ వివాదం – బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉద్రిక్తత
ఇక పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేంద్రంగా వివాదం రేగింది. జూన్ 2న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారని తెలిసిన వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. పాత మోడల్లో ఉన్న విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీస్ శాఖ భారీగా బందోబస్తు ఏర్పాటు చేసింది. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య విగ్రహ వ్యవహారంపై వాగ్వాదం కొనసాగుతోంది. గతంలో ఉన్న విగ్రహాన్ని యథాతథంగా ప్రతిష్టించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండగా, కాంగ్రెస్ కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ వివాదం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు చెడదెబ్బ తగిలేలా మారుతోంది.