- ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం
- భారత్కు ఎంత ప్రమాదం?
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఇరాన్ సమీపంలోని Strait of Hormuz ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలక బిందువుగా మారింది. పెర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే ఈ సన్నని జలసంధి వెడల్పు కొన్ని ప్రాంతాల్లో కేవలం 33 కిలోమీటర్లకు మాత్రమే పరిమితం. కానీ, దీని గుండా ప్రయాణించే ముడి చమురు పరిమాణం రోజుకు సుమారు 20 మిలియన్ బ్యారెల్స్ వరకు ఉంటుంది. అంటే సముద్ర మార్గం ద్వారా ప్రపంచానికి సరఫరా అయ్యే చమురులో దాదాపు ఐదో వంతు ఈ ఒక్క మార్గం గుండానే జరుగుతుంది.
ప్రాంతాల వారీగా చూస్తే, ఆసియా దేశాలే ఎక్కువగా ప్రభావితమవుతాయి. భారత్ తన ముడి చమురు దిగుమతుల్లో సుమారు 55–60 శాతం గల్ఫ్ దేశాల నుంచే పొందుతోంది. చైనా దిగుమతుల్లో కూడా గణనీయమైన భాగం సౌదీ అరేబియా, యుఎఇ, కువైట్, ఇరాక్ వంటి దేశాల నుంచే వస్తోంది. జపాన్, దక్షిణ కొరియా వంటి తూర్పు ఆసియా దేశాలు తమ ఇంధన అవసరాల్లో 70 శాతం కంటే ఎక్కువగా ఈ మార్గంపైనే ఆధారపడి పొందుతున్నాయి. ఈ మార్గం దెబ్బతింటే ఆసియా ఆర్థిక వ్యవస్థలపై తక్షణ ప్రభావం పడే అవకాశం ఉంది.
యూరప్కు సరఫరా అయ్యే చమురులో కూడా గల్ఫ్ దేశాల వాటా ఉంది, అయితే రష్యా, ఆఫ్రికా, ఉత్తర సముద్ర ప్రాంతాల నుంచి ప్రత్యామ్నాయ సరఫరా లభించడం వల్ల ప్రభావం కొంతవరకు పరిమితం కావచ్చు. అమెరికా ప్రత్యక్షంగా హార్ముజ్పై అంతగా ఆధారపడకపోయినా, గ్లోబల్ మార్కెట్ ధరల పెరుగుదల అమెరికా వినియోగదారులపై పరోక్షంగా భారమవుతుంది. ఎందుకంటే చమురు అంతర్జాతీయంగా ఒకే మార్కెట్ ధరలపై ఆధారపడి ఉంటుంది.
బీమా ప్రీమియంల ప్రభావం
హార్ముజ్ మార్గం మూసివేత లేదా అక్కడి భద్రతా ముప్పు పెరగడం వల్ల వెంటనే బీమా ప్రీమియాలు పెంచే ఆలోచనలో సంస్థలు ఉన్నాయి. షిప్పింగ్ కంపెనీలు అదనపు రిస్క్ చార్జీలు విధిస్తాయి. ఇప్పటికే కొన్ని నౌకాయాన సంస్థలు తమ ప్రయాణాలను వాయిదా వేసినట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యామ్నాయంగా సౌదీ అరేబియా తూర్పు తీరంలోని పైప్లైన్ మార్గాలు, యుఎఇలోని ఫుజైరా పోర్ట్ వంటి మార్గాలు ఉపయోగించవచ్చు. అయితే వాటి సామర్థ్యం హార్ముజ్ ద్వారా జరిగే మొత్తం సరఫరాను భర్తీ చేయడానికి సరిపోదు.
చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడితే, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఒక్కసారిగా ఎగిసే అవకాశం ఉంది. 10–20 డాలర్ల వరకు బ్యారెల్ ధర పెరిగే పరిస్థితి వస్తే, పెట్రోల్, డీజిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతాయి. రవాణా ఖర్చులు అధికమవడంతో ఆహార ధరలు, వినియోగ వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. ద్రవ్యోల్బణం మళ్లీ వేగం పుంజుకునే అవకాశాన్ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
భద్రతకు ముప్పు
భద్రతా పరంగా చూస్తే, ఈ ప్రాంతంలో అమెరికా, బ్రిటన్ వంటి దేశాల నౌకాదళాలు ఇప్పటికే గస్తీ కాస్తున్నాయి. ఇరాన్ నౌకాదళ కదలికలు పెరిగినట్లయితే చిన్నపాటి ఘర్షణలు కూడా పెద్ద సైనిక ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉంది. గతంలో కూడా హార్ముజ్ జలసంధి వద్ద నౌకల స్వాధీనం, డ్రోన్ దాడులు వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
మొత్తానికి హార్ముజ్ జలసంధి కేవలం భౌగోళిక మార్గం మాత్రమే కాదు; అది ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి. అక్కడ ఏ చిన్న అంతరాయం జరిగినా ఆసియా నుంచి యూరప్ వరకు ఆర్థిక వ్యవస్థలు ఒత్తిడికి లోనవుతాయి. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ జలసంధి పరిస్థితి ఎలా మారుతుందన్నది గ్లోబల్ మార్కెట్ల దిశను నిర్ణయించే అంశంగా మారింది.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.