March 23, 2026

బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి.. ఈ గుంతలు పూడిచేది ఎప్పుడు?

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీనివాసమంగాపురంలో కళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సమయం దగ్గరపడుతోంది. ఈ తరుణంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. అయితే, బ్రిడ్జి సమీపంలో ఏర్పడిన గుంతలను పూడ్చడంలో ఆర్ అండ్ బి (R&B) మరియు టీటీడీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పండుగ రోజుల్లో భక్తుల రద్దీ పెరిగితే ఈ గుంతల వల్ల మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం ప్రమాదాలు.. గాయపడుతున్న భక్తులు

శ్రీనివాసమంగాపురం ఆలయానికి వచ్చే భక్తులు ఈ బ్రిడ్జి వద్ద రోడ్డుపై ఉన్న గుంతలను గమనించలేక బైక్‌ల నుంచి పడిపోతున్నారు. రాత్రి వేళల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. ఇప్పటికే పలువురు భక్తులు తీవ్రంగా గాయపడిన ఘటనలు ఉన్నా, సంబంధిత శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అభివృద్ధిలో దూసుకుపోతున్న చంద్రగిరి నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఉండటం దురదృష్టకరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

టిప్పర్ల రవాణా ఉన్నా.. మట్టి పోసే నాథుడే లేడు!

జాతీయ రహదారి పనుల కోసం ఇదే మార్గంలో నిత్యం భారీ టిప్పర్లు, గ్రావెల్ లారీలు తిరుగుతున్నాయి. ఆ పనులకు సంబంధించిన కాంట్రాక్టర్లు కానీ, యజమానులు కానీ కనీసం ఆ గుంతల్లో మట్టి పోసి తాత్కాలికంగానైనా బాగు చేయకపోవడం గమనార్హం. కేవలం తమ లాభాల కోసం రోడ్లను వాడుకుంటున్నారే తప్ప, ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

అధికారులు తక్షణమే స్పందించాలి: స్థానికుల డిమాండ్

చంద్రగిరి ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఈ గుంతలను పూడ్చి రోడ్డుకు మరమ్మతులు చేయాలని భక్తులు కోరుతున్నారు. బ్రహ్మోత్సవాలకు ముందే రోడ్డును బాగు చేయకుంటే నిరసనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని శ్రీనివాసమంగాపురం గ్రామస్తులు విన్నవిస్తున్నారు.
#SrinivasaMangapuram #RoadSafety #Chandragiri #TirupatiNews #Potholes #Brahmotsavam #PublicGrievance #APRoads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *