
తన అరెస్టు వెనుక వెనుక పెద్ద రాజకీయ కుట్ర (political conspiracy) ఉందని కొమ్మినేని ఆరోపించారు. “తొమ్మిదేళ్ల క్రితం ఎన్టీవీలో ఉన్నప్పుడు అమరావతి భూ వ్యవహారాలపై ప్రశ్నించాను. అప్పటి నుంచే నాపై కక్ష పెంచుకున్నారని సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఆరోపించారు. ఇప్పుడు సాక్షిలో నిర్వహిస్తున్న డిబేట్లు నిశ్శబ్దం చేయాలన్న కుట్రలో భాగమే ఈ దాడి” అని విమర్శించారు. తాను ‘అమరావతి మహిళలు’ అనే పదం ఎక్కడా ఉపయోగించలేదని, కావాలనే తప్పుడు కేసు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు.
“70 ఏళ్ల వయసులో ఇలా కక్ష సాధించడం బాధాకరం. పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదు. స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వలేదని, కనీసం స్థానిక కానిస్టేబుల్ కూడా వెంట లేదు. ID కార్డు చూపించి రమ్మంటే ఎలా?” అని ప్రశ్నించారు. ఫిర్యాదు ఎవరు చేశారనే విషయాన్ని కూడా పోలీసులు స్పష్టంగా చెప్పలేదన్నారు. “ప్రజలు అంటున్నారు అంటే టీడీపీ కార్యకర్తలేనా? ఎవరి నష్టమో స్పష్టత ఉండాలి” అని వ్యాఖ్యానించారు.
“ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కాదు… వాటిని లక్షల కాపీల్లో ప్రచురించిన పత్రికలపై, వందల నిమిషాలు ప్రసారం చేసిన టీవీలపై కేసులు ఉండాలి. కానీ నాపై మాత్రమే కేసు పెట్టడం అన్యాయం” అని తీవ్రంగా స్పందించారు. ఈ పరిణామాలతో తన కుటుంబం తీవ్రంగా ఆందోళనకు గురైందన్నారు. “నా భార్య ఏడుస్తోంది, అబ్బాయి హుటాహుటిన మాదాపూర్ నుంచి వచ్చాడు. వారి మనశ్శాంతి దెబ్బతింది” అని తెలిపారు.
తన ఇంటికి పోలీసులు రావడం పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని కొమ్మినేని తీవ్ర ఆరోపణలు చేశారు. తుళ్లూరు ప్రజల ఫిర్యాదు ఆధారంగా విచారణ కోసం రావాల్సిందిగా పోలీసులు చెప్పినా, ఏ ఆధార పత్రాలు (official documents) చూపించకుండా, కేవలం ఐడీ కార్డులు చూపిస్తూ తీసుకెళ్లాలని ప్రయత్నించారని ఆయన తెలిపారు.
“చంద్రబాబు గారు, లోకేశ్ గారికి కోపం వస్తే ఎవరైనా జైలుకెళ్లాల్సిందే అన్నట్లుగా ఉంది. చట్టం, రాజ్యాంగం (Constitution) అన్నీ అప్రాంతంగా మారిపోయాయి. అయినప్పటికీ నేను పూర్తిగా సహకరిస్తానని పోలీసులకు చెప్పాను” అని కొమ్మినేని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం తనను మానసికంగా దెబ్బతీసేందుకే, దీని వెనుక కుట్రే ఉంది అని మరోసారి స్పష్టం చేశారు.