March 24, 2026

ఒకే చితిపై తండ్రీకొడుకులు: పెద్దపల్లి జిల్లాలో గుండెలు పిండేసే విషాదం!

 విధి ఆడిన వింత నాటకంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు గంట వ్యవధిలోనే ప్రాణాలు విడిచిన ఘటన పెద్దపల్లి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇల్లంత నిశబ్దంగా మారిపోగా, గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగెపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రాజేశం (56), ఆయన కుమారుడు శ్రీకాంత్ (37) మృతి చెందిన తీరు స్థానికులను కన్నీటి పర్యంతం చేసింది. రాజేశం గత కొంతకాలంగా పక్షవాతంతో (Paralysis) బాధపడుతూ మంచానికే పరిమితమయ్యారు. కాగా, కుమారుడు శ్రీకాంత్  అకస్మాత్తుగా ఛాతిలో నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

దురదృష్టవశాత్తు, మరుసటి రోజు మధ్యాహ్నం 1:45 గంటల సమయంలో ఇంటి వద్ద చికిత్స పొందుతున్న తండ్రి రాజేశం కన్నుమూశారు. తండ్రి మరణించిన విషాదం నుంచి తేరుకోకముందే, సరిగ్గా గంట వ్యవధిలో (మధ్యాహ్నం 2:30 గంటలకు) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుమారుడు శ్రీకాంత్ కూడా మరణించారు. అప్పటివరకు సంతోషంగా ఉన్న కుటుంబం, ఒక్కసారిగా ఇద్దరు వ్యక్తులను కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరి మృతదేహాలను ఒకేసారి అంత్యక్రియలకు తీసుకెళ్తున్న దృశ్యం గ్రామస్తుల కంటతడి పెట్టించింది. దాదాపు 20 ఏళ్ల క్రితం కూడా ఇదే కుటుంబంలో రాజేశం తల్లిదండ్రులు ఒకే రోజు మృతి చెందారని గ్రామస్తులు గుర్తు చేసుకోవడం గమనార్హం.

వరుస మరణాల వల్ల ఆ కుటుంబం ఆర్థికంగా, మానసికగా కుంగిపోయింది. శ్రీకాంత్ మరణంతో ఆయన భార్యాపిల్లలు అనాథలయ్యారు. ప్రభుత్వం మరియు స్థానిక దాతలు ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇలాంటి విషాదాలు పగవాడికి కూడా రాకూడదని అక్కడి వారు రోదిస్తున్న తీరు కలచివేస్తోంది.

#Peddapalli #Tragedy #FatherSonDeath #TelanganaNews #HeartAttack #Nagepalli #HumanInterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *