March 27, 2026

జైలులో ఉండడానికైనా సిద్ధమే, కానీ సైన్యంతో రాజీ ప్రసక్తే లేదు : ఇమ్రాన్ ఖాన్

తాను జీవితాంతం జైలులో ఉండడానికైనా సిద్ధమేకానీ, సైన్యంతో రాజీపడే పసక్తే లేదని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ప్రకటన చేశారు. దేశ రాజకీయ వ్యవస్థను సైన్యమే శాసిస్తోందని ఆయన ఆరోపించారు. 26వ రాజ్యాంగ సవరణ వంటి మార్పుల ద్వారా సైన్యం న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని దెబ్బతీసిందని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్‌లో “అటవీ చట్టం” నడుస్తోందని, ఇక్కడ శక్తిమంతులకు జవాబుదారీతనం లేదని ఆయన అభివర్ణించారు.

ఇమ్రాన్ ఖాన్‌పై వస్తున్న వదంతులను ఆయన కొట్టిపారేశారు. ఆయన సోదరి అలీమా ఖాన్ వెల్లడించిన వివరాల ప్రకారం, సైన్యం అనేది రాజకీయంగా తటస్థంగా ఉండాలని ఇమ్రాన్ తెలిపారు. ఎవరితోనూ రాజీపడబోనని ఆయన స్పష్టం చేశారు. సైన్యంతో లేదా అమెరికన్లతో తాను రాజీపడుతున్నట్లు వస్తున్న వార్తలను ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. తన మద్దతుదారులను నిరుత్సాహపరచడానికి, తన ఉద్యమాన్ని బలహీనపరచడానికి సైన్యమే ఈ వాదనలను ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.

న్యాయం కోసం, దేశంలో తాజా ఎన్నికల కోసం త్వరలో కొత్త ఉద్యమాన్ని ప్రారంభించాలని ఖాన్ యోచిస్తున్నారు. అడియాలా జైలు వెలుపల జరిగిన విలేకరుల సమావేశంలో, తన సోదరుడి తరపున మాట్లాడిన అలీమా ఖాన్, తాను దోపిడీదారులుగా, నియంతలుగా భావించే వారికి లొంగిపోనని ప్రకటించారు. రాజీపడటం కంటే జీవితాంతం జైలులో ఉండటానికి ఖాన్ సిద్ధంగా ఉన్నారని ఆమె చెప్పారు. సైన్యంతో లేదా అమెరికన్లతో రాజీపడినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధమని ఆమె పునరుద్ఘాటించారు.

తనను వీలైనంత ఎక్కువ కాలం జైలులో పెట్టి పార్టీని నిర్వీర్యం చేయడానికి న్యాయవ్యవస్థపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) కేసులను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. పిటీఐ న్యాయమూర్తులకు అండగా నిలుస్తుందని, వారు న్యాయంవైపు నిలిచేలా నైతిక మద్దతు ఇస్తుందని అన్నారు.

హింస జరిగే ప్రమాదం ఉన్నందున ఇమ్రాన్ ప్రజలను ఇస్లామాబాద్‌కు పిలవడానికి ఇష్టపడటం లేదని అలీమా ఖాన్ పేర్కొన్నారు. గతంలో సైన్యం తన మద్దతుదారులను చంపిన సంఘటనలను ఆమె ప్రస్తావించారు. అయితే, ఆయన త్వరలో దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రకటించబోతున్నారని తెలిపారు.

ఈ నెల ప్రారంభంలో, ఇమ్రాన్ ఖాన్ కుమారులు కాసిమ్, సులేమాన్ ఖాన్, తమ తండ్రి విడుదల కోసం US అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సహాయం కోరారు. “మేము అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడటానికి లేదా ఆయన సహాయం చేయగలిగే మార్గాన్ని గుర్తించడానికి ఇష్టపడతాము. ఎందుకంటే చివరికి, మేము మా తండ్రిని విడిపించడానికి, ఆయన ప్రాథమికున్న హక్కులను కాపాడడానికి ప్రయత్నిస్తున్నాము” అని లండన్‌లో నివసిస్తున్న కాసిమ్, సులేమాన్ అన్నారు.

“ట్రంప్ ప్రభుత్వానికి సందేశం విషయానికొస్తే, స్వేచ్ఛా వాణిజ్యం, సరైన ప్రజాస్వామ్యాన్ని సమర్థించే ఏ ప్రభుత్వానికైనా మా తండ్రి విడుదల కోసం పిలుపునివ్వాలని, ముఖ్యంగా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిని కోరతాము” అని ఆ ఇద్దరూ తెలిపారు.

“ఆయన మరణశయ్యలో ఉన్నారు, వెలుగు లేదు, న్యాయవాది లేరు, డాక్టర్ లేరు, కానీ ఆయన మనోధైర్యాన్ని కోల్పోవడం లేదని అన్నారు. ఆయనపై ఉన్న కేసులు “రాజకీయ ప్రేరేపితమైనవి” అని నిశితంగా పరిశీలిస్తే గుర్తించవచ్చని వారు చెప్పారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడటానికి తమ తండ్రి అనుమతి కోరామని వారు వెల్లడించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *