పోలీసుల సాహసోపేత చర్య
పోలీసుల సాహసోపేత చర్య
అనుకోకుండా జారిపడిపోయిన పెద్ద మొత్తాన్ని పోలీసులు మెరుపు వేగంతో స్పందించి బాధితుడికి అప్పగించిన ఘటన మధిరలో చోటుచేసుకుంది. పోగొట్టుకున్న నగదు దొరుకుతుందో లేదో అని ఆందోళనలో ఉన్న బాధితుడికి కేవలం 30 నిమిషాల్లోనే ఆ సొమ్మును తిరిగి అందజేసి మధిర పోలీసులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. సీసీ కెమెరాల నిఘా ఎంతటి కీలకమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
నగదు పోగొట్టుకున్న ట్రాక్టర్ కొనుగోలుదారు
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కలగర గ్రామానికి చెందిన రావుల అప్పారావు అనే వ్యక్తి ట్రాక్టర్ ట్రక్ కొనుగోలు చేయడం కోసం నగదుతో కోదాడకు బయలుదేరారు. మధిర పట్టణంలోని శాంతి థియేటర్ సమీపంలో అప్పారావు జేబులో ఉన్న రూ. 60,000 నగదు అకస్మాత్తుగా జారిపడిపోయింది. విషయం గమనించిన బాధితుడు వెంటనే మధిర టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సీసీ కెమెరాల నిఘాతో దొరికిన సొమ్ము
ఫిర్యాదు అందిన వెంటనే మధిర పట్టణ సీఐ దోమల రమేష్ అప్రమత్తమయ్యారు. ఎస్సై నవిత చౌదరి నేతృత్వంలో సిబ్బంది డి.శివ, ఎన్.రమేష్లను రంగంలోకి దించారు. ఘటనా స్థలంలోని సీసీ టీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు, అతి తక్కువ సమయంలోనే నగదును స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు ఫిర్యాదు చేసిన కేవలం అరగంట వ్యవధిలోనే పోగొట్టుకున్న రూ. 60 వేలను ఎస్సై నవిత చౌదరి చేతుల మీదుగా అప్పగించారు.
సిబ్బందికి అభినందనలు.. ప్రజలకు సూచనలు
సమయస్ఫూర్తితో వ్యవహరించి బాధితుడికి న్యాయం చేసిన కానిస్టేబుల్ శివ, రమేష్లను సీఐ రమేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని సీసీ కెమెరాల వలనే బాధితుడికి సత్వర న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ షాపులు, అపార్ట్మెంట్లు మరియు నివాస గృహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా నేరాల నియంత్రణలో పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
Madhira #KhammamPolice #TelanganaPolice #CCTVFootage #QuickAction #PublicSafety #GoodSamaritan #CrimePrevention #SuccessStory
