కేరళ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు | 70% MLAs Criminal Cases
కేరళ అసెంబ్లీలో ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేల నేపథ్యం ఆందోళనకరంగా ఉందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) సంచలన నివేదికను వెల్లడించింది. రాష్ట్రంలోని సుమారు 70 శాతం మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, అలాగే సగానికి పైగా ఎమ్మెల్యేలు కోటీశ్వరులని ఈ నివేదిక స్పష్టం చేసింది.
నివేదికలోని కీలక అంశాలు
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), కేరళ ఎలక్షన్ వాచ్ సంయుక్తంగా 132 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల అఫిడవిట్లను విశ్లేషించాయి. ఈ విశ్లేషణలో చాలా అంశాలు వెల్లడయ్యాయి,
మొత్తం 132 మంది ఎమ్మెల్యేలలో 92 మందిపై అంటే 70% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇవి కేవలం పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులు ఉన్నాయి. అధికారంతో అణగదొక్కబడిన, అసలు నమోదు కాని కేసులు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇందులో మళ్ళీ 33 మంది ఎమ్మెల్యేలపై అంటే 25% కేసులు అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హత్య, హత్యాయత్నం వంటి అభియోగాలు ఉన్నాయి.
ఇవే కాకుండా ఇద్దరు ఎమ్మెల్యేలపై హత్య (IPC సెక్షన్ 302), ముగ్గురిపై హత్యాయత్నం (IPC సెక్షన్ 307) కేసులు ఉన్నాయి. మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉండగా, అందులో ఒకరిపై అత్యాచారం కేసు ఉండటం గమనార్హం. ఇవన్నీ అఫిడవిట్ల ప్రకారం చెబుతున్నవి మాత్రమే. ఇక అసలు నమోదే కానివి, వెలుగులోకే రానివి కూడా ఉంటాయి.
read this article also : ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా: ఏప్రిల్ 9 నుండి పోలింగ్.. మే 4న ఫలితాలు!
కోటీశ్వరులైన ఎమ్మెల్యేలు
సాధారణంగా ఎన్నికల వ్యవహారం అంటేనే ధనవంతుల వ్యవహారం అనేది జనంలో ఇప్పటికే ప్రగాఢంగా ఉంది. ఈకోణంలో ఆలోచించినప్పుడు ఎమ్మెల్యేల ఆర్థిక స్థితిగతులపై కూడా నివేదిక కీలక సమాచారాన్ని అందించింది. సగానికి పైగా ఎమ్మెల్యేలు కోటీశ్వరులని, వారి ఆస్తుల విలువ కోట్ల రూపాయల్లో ఉందని పేర్కొంది. ప్రజాప్రతినిధుల నేర చరిత్ర,పెరుగుతున్న ఆస్తుల ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.
#KeralaMLAs #ADRReport #CrimeInPolitics #KeralaPolitics #AndhraPulse #CrorepatiMLAs

