March 21, 2026

చంద్రగిరి గడ్డపై వైసీపీ సమరశంఖం

చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నేతలు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని, అక్రమ కేసులతో తమ పోరాటాన్ని ఆపలేరని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

జైలు గోడలు పోరాటాన్ని ఆపలేవు

రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు పెట్టి ఎనిమిది నెలల పాటు జైలులో నిర్బంధించారని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మండిపడ్డారు. మనిషిని జైలులో పెట్టవచ్చు కానీ, ప్రజా సమస్యలపై చేసే పోరాటాన్ని ఏ జైలు గోడలు ఆపలేవని ఆయన ఉద్ఘాటించారు. జైలుకు వెళ్తున్న సమయంలోనూ తమ నాయకత్వంలో ఎక్కడా బెరుకు లేదని, కార్యకర్తల కోసం నిలబడే తత్వం తమదని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు, కేసులు సహజమని.. వాటిని తట్టుకుని నిలబడినప్పుడే నిజమైన నాయకులుగా ఎదుగుతారని కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు.

గ్రామ స్థాయి నుంచి కమిటీల వేట

పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు బృహత్తర కార్యక్రమం చేపట్టారు. ప్రతి పంచాయతీ నుంచి సుమారు 90 మందికి పార్టీ అనుబంధ కమిటీల్లో అవకాశం కల్పించబోతున్నట్లు మోహిత్ రెడ్డి ప్రకటించారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు దక్కాలన్నదే తమ సంకల్పమని, ఇందుకోసం కేంద్ర కార్యాలయం ప్రత్యేక వెసులుబాటు కల్పించిందని తెలిపారు. వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి, పారదర్శకంగా ఈ నియామకాలు చేపట్టాలని స్థానిక నేతలకు సూచించారు.

రంగులు మార్చడం తప్ప అభివృద్ధి సున్నా

చంద్రగిరి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే తీరుపై మోహిత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో తాము చేసిన అభివృద్ధి పనులకు ఇప్పుడు అధికారంలో ఉన్న వారు రంగులు వేసి, కొత్త శిలాఫలకాలు వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేవలం ప్రారంభోత్సవాలు చేయడం తప్ప, ఈ రెండేళ్లలో ఎమ్మెల్యే నాని సాధించిందేమీ లేదని విమర్శించారు. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కేవలం ప్రచారానికే పరిమితమయ్యారని మండిపడ్డారు.

కార్యకర్తలకు అండగా మేమున్నాం

చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైన క్యాడర్ ఉందని, వారిని రక్షించుకోవడం తమ ప్రథమ కర్తవ్యమని చెవిరెడ్డి సోదరులు స్పష్టం చేశారు. ఎక్కడ ఏ కార్యకర్తకు ఇబ్బంది కలిగినా, ఏ నేతపై అక్రమ కేసులు పెట్టినా అందరికంటే ముందు తాము వచ్చి నిలబడతామని హామీ ఇచ్చారు. నాలుగు రోజుల్లోగా కమిటీల ప్రక్రియను పూర్తి చేసి, నియోజకవర్గంలో పార్టీ జెండాను రెపరెపలాడించాలని పిలుపునిచ్చారు. ఈ నియామకాలను రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు పర్యవేక్షిస్తారని వెల్లడించారు.

#YSKCP #Chandragiri #ChevireddyMohitReddy #YSJagan #AndhraPradesh #Politics #YSRCPFamily #PublicService

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *