బ్రెజిల్లో ప్రకృతి ప్రకోపం..
దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. ఆగ్నేయ బ్రెజిల్లోని మినాస్ గెరైస్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా బురద వరద ముంచెత్తింది. ఈ ఊహించని విపత్తులో 30 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది ఇళ్లు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. మరెంతో మంది శిథిలాల కింద, బురదలో చిక్కుకుపోయి ఉంటారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొండచరియలు విరిగిపడి విధ్వంసం
మినాస్ గెరైస్ రాష్ట్రంలోని జుయిజ్ డి ఫోరా ప్రాంతంలో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. దీనివల్ల బారియో పార్క్ జార్డిమ్ బర్నియర్ పరిసరాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండలపై ఉన్న మట్టి, రాయి ఒక్కసారిగా వాన నీరుతో కలిసి బురద ప్రవాహంగా మారి లోతట్టు ప్రాంతాలపై విరుచుకుపడింది. ఈ ఉధృతికి సుమారు 100కు పైగా ఇళ్లు నేలమట్టమవ్వగా, ఇప్పటివరకు 39 మంది గల్లంతైనట్లు సమాచారం.
చీకట్లో ముంచెత్తిన మృత్యువు
ఈ ప్రమాదం రాత్రి సమయంలో సంభవించడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. ప్రజలంతా నిద్రలో ఉన్న వేళ బురద ప్రవాహం ముంచెత్తడంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. సుమారు 3 వేల మంది తమ ఇళ్లలోనే చిక్కుకుపోయారని జుయిజ్ డి ఫోరా మేయర్ మార్గరీడా సలోమావో వెల్లడించారు. సమాచారం అందుకున్న విపత్తు నిర్వహణ దళాలు హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.
సత్వర సాయం అందజేస్తాం: అధ్యక్షుడు లులా
ఈ ఘోర విపత్తుపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా స్పందించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మానవతా దృక్పథంతో తక్షణ సాయం అందించడమే కాకుండా, ప్రాథమిక సేవలను పునరుద్ధరించడం, నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ (X) వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం గాయపడిన వారిని సమీప వైద్య శిబిరాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
#BrazilFloods #Landslides #MinasGerais #NaturalDisaster #EmergencyUpdate #PrayForBrazil #GlobalNews #RainHavoc
