బంగ్లాదేశ్లో విద్యార్థి నేత హత్యలతో చెలరేగిన హింస దేశాన్ని కుదిపేస్తోంది. షరీఫ్ ఉస్మాన్ హాది హత్య తరువాత దేశవ్యాప్తంగా అల్లర్లు, మీడియా కార్యాలయాల దహనం, భారత దౌత్య కార్యాలయాలపై దాడి ప్రయత్నాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఖుల్నాలో మరో విద్యార్థి నేత మహ్మద్ మోతలెబ్ సిక్దర్పై కాల్పులు జరగడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.
ఢాకా:
బంగ్లాదేశ్లో విద్యార్థి నేత హత్యలతో రాజకీయ ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఖుల్నాలో సోమవారం గుర్తుతెలియని దుండగులు విద్యార్థి నేత మహ్మద్ మోతలెబ్ సిక్దర్ తలపై కాల్పులు జరిపారు. ఆయన ప్రస్తుతం ప్రమాద స్థితిలో లేరని స్థానిక మీడియా వెల్లడించింది. సిక్దర్, నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) ఖుల్నా కేంద్ర నిర్వాహకుడు.
NCP అనేది 2024లో ప్రధాని షేక్ హసీనాను అధికారం నుంచి తప్పించడంలో కీలక పాత్ర పోషించిన ‘స్టూడెంట్స్ అగెనెస్ట్ డిస్క్రిమినేషన్’ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన రాజకీయ వేదికగా గుర్తింపు పొందింది.
ఇదే సమయంలో విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్య బంగ్లాదేశ్ను అగ్నికీలగా మార్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించిన మరుసటి రోజే హాది కాల్పుల్లో గాయపడి, చికిత్స పొందుతూ సింగపూర్లో మృతి చెందాడు.
హాది మరణ వార్త వెలువడిన వెంటనే ఢాకా సహా పలు నగరాల్లో హింసాత్మక ఆందోళనలు చెలరేగాయి. ప్రముఖ మీడియా సంస్థలు ది డైలీ స్టార్, ప్రథమ్ ఆలో కార్యాలయాలకు నిప్పుపెట్టారు. అలాగే ఢాకాలోని ధన్మండీ–32లో ఉన్న షేక్ ముజీబుర్ రెహమాన్ నివాసంపై మరోసారి దాడి జరిగింది.
రాజ్షాహీ, చట్టోగ్రామ్ ప్రాంతాల్లోని భారత దౌత్య కార్యాలయాల సమీపంలో నిరసనలు చోటుచేసుకున్నాయి. రాజ్షాహీలో భారత అసిస్టెంట్ హై కమిషన్ వైపు దూసుకెళ్లిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని చోట్ల రాళ్లదాడులు జరిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
రాడికల్ వేదిక ‘ఇంకిలాబ్ మోంచో’కు చెందిన ప్రముఖ నేత అయిన హాది, “భారత ఆధిపత్యం”పై తీవ్ర విమర్శలతో ప్రసిద్ధి చెందాడు. అతడిపై దాడి చేసిన వ్యక్తులు భారత్కు పారిపోయారని నిరసనకారులు ఆరోపిస్తున్నప్పటికీ, దీనికి సంబంధించి ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు లేవని బంగ్లాదేశ్ పోలీసులు చెబుతున్నారు.
ఈ అల్లర్ల మధ్య మతపరమైన ఉద్రిక్తత కూడా చోటుచేసుకుంది. మైమెన్సింగ్లో దీపు చంద్ర దాస్ అనే హిందూ వ్యక్తిని మతదూషణ ఆరోపణలపై గుంపు దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు ధృవీకరించారు.
హాది మృతికి ప్రతిస్పందనగా తాత్కాలిక ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ దేశవ్యాప్తంగా జాతీయ సంతాప దినాన్ని ప్రకటించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని ఆదేశించారు. శనివారం ఢాకా యూనివర్సిటీలో హాది అంత్యక్రియలు జరిగాయి.
అయితే హాది హత్యకు సంబంధించి నిందితుడు దేశం విడిచిపోయాడన్న వార్తలపై అదనపు ఐజీపీ స్పందిస్తూ, నమ్మదగిన సమాచారం తమకు అందలేదని స్పష్టం చేశారు. హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.