బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల భద్రతపై ఆందోళన కలిగిస్తున్న “దీపు చంద్ర దాస్” ఉదంతం ఇప్పుడు సరికొత్త మలుపులు తిరుగుతోంది. దైవదూషణ చేశారనే ఆరోపణలతో జరిగిన ఈ మూకదాడిలో (Lynching), వాస్తవానికి అతడు ఎలాంటి తప్పు చేయలేదని ప్రాథమిక విచారణలో తేలడం గమనార్హం.
బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్ జిల్లాలో జరిగిన దీపు చంద్ర దాస్ హత్య కేసులో వెలుగులోకి వస్తున్న వివరాలు సభ్యసమాజాన్ని విస్తుగొలుపుతున్నాయి. ఈ ఘటన కేవలం మతోన్మాదమే కాదు, పని చేసే చోట సహోద్యోగుల నమ్మకద్రోహం కూడా అని స్పష్టమవుతోంది.
బలవంతపు రాజీనామా.. మృత్యువుకు అప్పగింత: తాజా నివేదికల ప్రకారం, దీపు చంద్ర దాస్ పని చేస్తున్న ఫ్యాక్టరీ యాజమాన్యం అతడికి రక్షణ కల్పించాల్సింది పోయి, మృత్యువుకు దగ్గర చేసింది. బయట ఉన్మాద మూక కాచుకుని ఉందని తెలిసినా, ఫ్యాక్టరీ ఫ్లోర్ ఇన్చార్జ్ అతడితో బలవంతంగా రాజీనామా చేయించి, ఫ్యాక్టరీ గేటు బయట ఉన్న గుంపుకు అప్పగించారు.
క్షమాపణలు కోరినా ఆగని దాడి: దీపు తాను ఏ తప్పూ చేయలేదని, ఒకవేళ ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలని వేడుకున్నాడు. కానీ, ఆ క్రూర మూక కనికరించలేదు. అతడిని కొట్టి చంపడమే కాకుండా, శవాన్ని ఢాకా-మైమెన్సింగ్ హైవేపై ఒక చెట్టుకు కట్టి తగలబెట్టారు. ఈ దారుణ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ప్రపంచాన్ని కుదిపేశాయి.
దైవదూషణకు ఆధారాల్లేవు: బంగ్లాదేశ్ దర్యాప్తు సంస్థ (RAB) తెలిపిన వివరాల ప్రకారం.. దీపు చంద్ర దాస్ ఇస్లాం మతాన్ని లేదా ప్రవక్తను దూషించినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేవలం పుకార్ల ఆధారంగానే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు. పాత కక్షల వల్ల ఎవరైనా కావాలని ఇలా చేయించారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
అంతర్జాతీయంగా ఆగ్రహం: భారత విదేశీ వ్యవహారాల శాఖ (MEA) ఈ ఘటనను “భయంకరమైనది” (Horrendous) గా అభివర్ణించింది. బంగ్లాదేశ్లోని మైనారిటీలకు భద్రత కల్పించాలని భారత్ డిమాండ్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో 10 మందికి పైగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.