మండిపోతున్న ఏపీ.. నిప్పుల కొలిమిగా సీమ
SUMMER HIGH TEMPERATURE
ఆంధ్రప్రదేశ్లో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నడివేసవి రాకముందే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పగటిపూట ఉక్కపోత, తీవ్రమైన వడగాల్పులతో ప్రజలు రోడ్ల మీదకు రావాలంటేనే భయపడిపోతున్నారు. రానున్న రోజుల్లో ఈ ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది.
మీడియా రంగంలోకి విజయసాయిరెడ్డి ఈ వార్తను కూడా చదవండి
కడపలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు
శనివారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200 మండలాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదై దిమ్మతిరిగేలా చేసింది. ముఖ్యంగా కడప జిల్లా పొట్టిపాడులో అత్యధికంగా 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే అత్యంత వేడి ప్రాంతంగా నిలిచింది. నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో కూడా 44.3 డిగ్రీలతో ఎండ తీవ్రత జనాలను ఉక్కిరిబిక్కిరి చేసింది.
తీవ్రమైన వడగాల్పుల ముప్పు
రాబోయే రెండు నెలల్లో ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నేడు కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, చిత్తూరుతో పాటు తిరుపతి జిల్లాల్లో అత్యధిక వేడి ఉంటుందని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
జాగ్రత్తలు పాటించాల్సిందే
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లే సమయంలో తలకి టోపీ లేదా రుమాలు కట్టుకోవాలని, తెల్లటి కాటన్ వస్త్రాలు ధరించాలని కోరుతున్నారు. మంచినీరు, ఓఆర్ఎస్ వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని.. ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్నవారు ఎండలో ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
#APHeatwave #AndhraPradesh #WeatherUpdate #SummerAlert #Kadapa #Nellore #SunstrokePrecautions
మీడియా రంగంలోకి విజయసాయిరెడ్డి ఈ వార్తను కూడా చదవండి

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
