March 23, 2026

అహ్మదాబాద్ విమాన ప్రమాదం: 241 మంది మృతి, టేకాఫ్‌కు ముందే సమస్యలు?

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో (Ahmedabad) జరిగిన ఎయిర్ ఇండియా (Air India) విమాన ప్రమాదం (Plane Crash) విషాదాంతమైంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోవడంతో, అందులో ప్రయాణిస్తున్న 241 మంది దుర్మరణం పాలయ్యారని అహ్మదాబాద్ సీపీ ధృవీకరించారు. విమానం టేకాఫ్‌కు ముందే సాంకేతిక సమస్యలు (Technical issues) ఉన్నాయని ఒక ప్రయాణికుడు చేసిన వీడియో, ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

అహ్మదాబాద్, జూన్ 12: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో (Plane Crash) ఎవరూ కూడా బతకలేదని అహ్మదాబాద్‌ సీపీ తెలిపారు. దీంతో ప్రయాణికుల కుటుంబాల్లో అంతులేని విషాదం మిగిలింది. మొత్తం 241 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. విమాన ప్రమాదంలో స్థానికులు చాలా మంది గాయపడ్డారు. బాధితులు చికిత్స పొందుతున్న అహ్మదాబాద్‌ సివిల్‌ ఆస్పత్రికి వెళ్లారు సీఎం భూపేంద్ర పటేల్.

ప్రమాదానికి గురైన విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది. అక్కడి నుంచి లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే ఢిల్లీ-అహ్మదాబాద్ మధ్యలోనే విమానంలో సాంకేతిక సమస్యపై (Technical issues) ఓ ప్రయాణికుడు వీడియో చేశాడు. ఏసీలు పనిచేయడం లేదని, సీట్‌కి ఉండే స్క్రీన్లు కూడా ఆన్ అవ్వడంలేదని, అసలు ఫ్లైట్ అంతా ఏదో తేడాగా ఉందన్నట్లు అతడు అనుమానం వ్యక్తం చేసిన ఆ వీడియో ఇప్పుడు బయటపడింది. సోషల్ మీడియాలో అది కాస్తా తెగ వైరల్ అవుతోంది. అటు ఆ వ్యక్తి చేసిన ట్వీట్‌కు జాతీయ మీడియా రిపోర్టర్ కూడా స్పందించారు.

ఇదిలా ఉంటే.. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఎయిర్ ఇండియా (Air India) బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయింది. మేఘానిలోని గుజ్‌సెల్‌ విమానాశ్రయ సమీప ప్రాంతంలో విమానం కుప్పకూలడంతో భారీ పేలుడు కారణంగా దట్టమైన పొగలు వ్యాపించాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా 171 విమానం అహ్మదాబాద్ నుంచి 230 మంది ప్రయాణికులతో (Passengers) లండన్‌లోని గాట్విక్‌ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరింది. మధ్యాహ్నం 1.38 నిమిషాలకు విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే ప్రమాదానికి గురైంది. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా అనేక మంది ఈ విమానంలో ఉన్నారు.

ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది సహా మొత్తం 242 మంది విమానంలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. విమానంలో 169 మంది భారతీయులు.. 53 మంది బ్రిటన్ పౌరులు.. ఏడుగురు పోర్చుగల్, ఒకరు కెనడా పౌరుడు ఉన్నట్టు గుర్తించారు. విమానంలో ఇద్దరు శిశువులు సహా 13 మంది చిన్నారులు ఉన్నారు. ప్రమాదంలో 241 మంది ప్రయాణీకులు మరణించారని అహ్మదాబాద్ సీపీ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు విదేశాంగశాఖ ప్రగాఢ సంతాంపం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *