West Bengal Election 2026 : BJP vs TMC on ‘మాఛే భాతే బాంగాలి’ Why?
“మాఛే భాతే బాంగాలి” అంటే ఏంటి? ఈ మూడు పదాలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో రాజకీయ దుమారం రేపుతున్నాయి. జస్ట్ మూడు పదాలు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వాతావరణంలో వేసవిని మించిన వేడి పుట్టిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమం కంటే ఈ మూడు పదాలే ముఖ్య ప్రచారస్త్రాలుగా మారిపోయాయి. ఇంతకీ ఏంటి “మాఛే భాతే బాంగాలి”- చేపల పులుసు – అన్నం అని అర్థం. కానీ, ఇది బెంగాలీలకు చాలా సెంటిమెంట్ పండగైనా, పబ్బమైనా ఇది లేకపోతే కుదరదంతే. అందుకే “మాఛే భాతే బాంగాలి” అనే పాత సామెతగా మారిపోయింది.
అదే రాజకీయ పార్టీల మధ్యన కొత్త లడాయిగా మారిపోయంది. భౌగోళిక పరిస్థితుల వల్ల కూడా ఈ ఆహారం అభివృద్ధి చెందింది. గంగ–బ్రహ్మపుత్ర డెల్టా ప్రాంతంలో విస్తారంగా లభించే చేపలు, ప్రధాన పంట అయిన బియ్యంతో కలసి శతాబ్దాలుగా బెంగాలీ ఆహార సంస్కృతిని నిర్మించాయి. పెళ్లిళ్లు, పూజలు, ముఖ్యంగా దుర్గాపూజ సమయంలో చేప, మాంసాహారం అనివార్య భాగంగా ఉంటాయి.
తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణల ప్రకారం, బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాలీల ఆహారపు సంస్కృతిపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉందని చెబుతోంది. “వెజిటేరియన్ రాజకీయాలు” పేరుతో బెంగాలీల సంస్కృతిలో అంతర్భాగమైన “మాఛే భాతే బాంగాలి” అనే పాత సామెతను వెజిటేరియన్ తో తిరగరాస్తారని, చేప–అన్నాన్ని నిషేధిస్తారని ఆరోపించింది. ఇతర రాష్ట్రాల్లో మాంసం అమ్మకాలపై పరిమితులు విధించిన ఉదాహరణలను చూపిస్తూ, అదే విధానాన్ని బెంగాల్లో కూడా అమలు చేసే అవకాశం ఉందని ప్రచారం చేస్తోంది. దీంతో బీజేపీ ఇరుకున పడిపోయింది.
Read this article also: Kamal Hasan sensational Decision : No contesting- DMKకి బేషరతు మద్దతు!
చేపలతో తంటాలు పడుతున్న బీజేపీ
దీనికి ప్రతిగా బీజేపీ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లేటప్పుడు చేప తింటూ కనిపించడం, ప్రచారంలో చేపలతో పాల్గొనడం వంటి చర్యలు చేపడుతున్నారు. బెంగాలీ ఆహారపు సంస్కృతిని గౌరవిస్తామని చెప్పే సంకేతంగా ఈ కార్యక్రమాలను ఉపయోగిస్తున్నారు. తృణమూల్ ప్రచారం చేస్తున్న “బీజేపీ వస్తే చేప–మాంసం నిషేధం” అనే వాదనను బలహీనపరచడం ఈ వ్యూహం వెనుక ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
ఎన్నికల రాజకీయాల్లో “బయటి పార్టీ” అనే ఆరోపణ తృణమూల్ తరచుగా వినియోగించే ఆయుధం. బీజేపీ పెరుగుతున్న ప్రభావాన్ని అడ్డుకోవడానికి సంస్కృతి, భాష, ఆహారపు అలవాట్లను ప్రస్తావిస్తూ స్థానిక భావోద్వేగాలను రేకెత్తించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు, బీజేపీ మాత్రం బెంగాలీ సంస్కృతిని అంగీకరిస్తున్నామనే సందేశంతో ఆ ప్రచారాన్ని ఎదుర్కొంటోంది.
ఇలా అభివృద్ధి, ఉద్యోగాలు, సంక్షేమం వంటి అంశాలతో పాటు“చేప–మాంసం” కూడా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కీలక రాజకీయ అంశంగా మారింది.
ఓటు పోరు ఇప్పుడు వీధుల్లోనే కాదు — బెంగాలీ భోజన ప్లేట్లలో కూడా జరుగుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

