
తిరుమల పవిత్ర క్షేత్రంలో భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని మరింత తలపించేలా శ్రీ వేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పనులను ఉండాలని టీటీడీ బోర్డు చైర్మన్ బీ.ఆర్. నాయుడు కోరారు. శుక్రవారం సాయంత్రం ఆయన మ్యూజీయంను తనిఖీ చేశారు. ఆయనతో పాటు బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
టీటీడీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సహకారంతో కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంగా అభివృద్ధి చేస్తున్న గ్యాలరీలను చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు అనేక సూచనలు చేస్తూ, మ్యూజియం రూపకల్పనలో శ్రద్ధ పెట్టాలని కోరారు.
తిరుమల క్షేత్ర చరిత్ర, వైభవం, పురాణ నేపథ్యం, భక్తుల విశ్వాసానికి ప్రతిబింబంగా మ్యూజియం ఉండాలనీ, భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానం అందించేందుకు ఇది ఓ కీలక వేదికగా ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ఈ తనిఖీలలో డిప్యూటీ ఈవో మరియు ఆరోగ్య శాఖ ఇన్చార్జ్ చీఫ్ మ్యూజియం ఆఫీసర్ సోమన్నారాయణ, హెల్త్ ఆఫీసర్ మధుసూదన్, ఏవిఎస్వో విశ్వనాధ్, మ్యూజియం క్యూరేటర్ శివ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.