
కేంద్ర హోం మంత్రి అమిత్ షా త్వరలో తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ సందర్బంగా నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు (National Turmeric Board) ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అంతేకాకుండా పసుపు బోర్డు అధికారిక లోగో (official logo)ను కూడా ఆయన ఆవిష్కరించనున్నారు.
ఇప్పటికే ఎంపీ ధర్మపురి అర్వింద్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగిరెడ్డితో కలిసి ఢిల్లీలో అమిత్ షాను కలిసి, అధికారిక ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ అర్వింద్, “పసుపు రైతులకు ప్రయోజనం కలిగించేలా ప్రధాని మోదీ ఇచ్చిన హామీని అమలు చేస్తున్నాం. బోర్డు ప్రారంభం ఈ నెల (జూన్) చివరిలో జరగనుంది,” అని తెలిపారు.
అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఖచ్చితమైన తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ మద్దతు కూడా ఉందన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని Turmeric Board కార్యాలయంగా ఉపయోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు తెలిపారు.