
అమరావతి, జూన్ 07, 2025: త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ (Bakrid) పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండడమే ఈ పండుగ ఇచ్చే ప్రధాన సందేశమని ఆయన అన్నారు. శనివారం బక్రీద్ నేపథ్యంలో ముస్లింలకు మరియు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
బక్రీద్ పర్వదినం రోజున ఖుర్బానీ (Qurbani) ఇచ్చే ముస్లింలకు ఎంతో పుణ్యఫలం లభిస్తుందని అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఈ పండుగ త్యాగనిరతికి ప్రతీక అని, ఇతరుల పట్ల ప్రతి ఒక్కరూ సోదరభావం (Brotherhood) చూపాలని ఆయన పిలుపునిచ్చారు. త్యాగం మనిషిని ఉన్నతుడిని చేస్తుందని, మహనీయుని త్యాగానికి గుర్తుగా ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంటారని తెలిపారు.
దైవ ప్రసన్నం కోసం తనకిష్టమైన ఎలాంటి వస్తువునైనా త్యాగం చేయాలని ‘ఖుర్బాని’ సంప్రదాయం ప్రతి యేటా గుర్తు చేస్తుందని అబ్దుల్ అజీజ్ వివరించారు. ప్రజలందరికీ అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.