గ్రామ్ జి చట్టం ఒక అక్రమ చట్టం: వైఎస్ షర్మిల
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఖూనీ చేసేందుకే కేంద్రం కొత్త నిబంధనలు తెస్తోందని షర్మిల ఆరోపించారు. గతంలో ఉన్న మన్రేగా చట్టం ప్రకారం పనులు నిర్ణయించే అధికారం గ్రామసభలకు ఉండేదని, కానీ కొత్త ‘గ్రామ్ జి’ చట్టంతో ఆ అధికారాన్ని ఢిల్లీకి కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “గ్రామాలకు ఏం కావాలో ఢిల్లీలో కూర్చున్న వారికి ఏం తెలుస్తుంది?” అని ఆమె ప్రశ్నించారు. ఇది గ్రామ స్వరాజ్యాన్ని దెబ్బతీయడమేనని విమర్శించారు.
రాష్ట్రంపై రూ. 5 వేల కోట్ల అదనపు భారం
ఉపాధి హామీ నిధుల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న కొత్త విధానంపై షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.
పాత పద్ధతి: మన్రేగాలో 100 శాతం నిధులు కేంద్రమే ఇచ్చేది.
కొత్త పద్ధతి: గ్రామ్ జి పథకంలో 40 శాతం నిధులు రాష్ట్రాలు భరించాలి. ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఏడాదికి అదనంగా రూ. 5 వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తుందని ఆమె నిలదీశారు. రాష్ట్రం తన వాటా ఇవ్వకపోతే కేంద్రం కూడా 60 శాతం నిధులు ఇవ్వదని, తద్వారా పథకాన్ని పూర్తిగా నిలిపివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
వైఎస్సార్ కష్టానికి తూట్లు పొడుస్తున్నారు
2006లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకాన్ని దేశానికే ఆదర్శంగా అమలు చేశారని షర్మిల గుర్తు చేశారు. రాష్ట్రంలో 60 లక్షల బ్యాంకు ఖాతాలు తెరిపించి, కూలీల పొట్ట నింపిన ఘనత వైఎస్సార్దేనని కొనియాడారు. కానీ నేటి కూటమి ప్రభుత్వం ఆ పథకాన్ని దిగజార్చిందని, ముందుగా మహాత్మా గాంధీ పేరు తొలగించి, ఇప్పుడు పని హక్కునే కాలరాస్తున్నారని విమర్శించారు.
ఉపాధి హామీ పరిరక్షణే కాంగ్రెస్ లక్ష్యం
నిబంధనల పేరుతో ఉపాధి హామీని చంపేయాలని చూస్తే సహించేది లేదని షర్మిల స్పష్టం చేశారు. “గ్రామ్ జి చట్టం వద్దని చెప్పండి.. గ్రామాలను రక్షించుకోండి” అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతిలోనే పునరుద్ధరించే వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్త ఉద్యమం ఆపదని ఆమె భీష్మించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.
#YSSharmila #MGNREGA #Congress #Anantapur #APPolitics #EmploymentGuarantee #GramG #YSR #LatestNews
