కర్ణాటకలోని విజయపురలో గురువారం తెల్లవారుజామున ఒక భీకర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ఒక ప్రముఖ కార్ సర్వీసింగ్ సెంటర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడ పార్క్ చేసి ఉన్న 20కి పైగా కార్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. జాతీయ రహదారి 50 పక్కన ఉన్న ‘హెచ్ఎంకే (HMK) కార్ సర్వీస్ సెంటర్’లో ఈ ప్రమాదం జరిగింది. క్షణాల్లోనే మంటలు వర్క్షాప్ అంతటా వ్యాపించడంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల ప్రకారం.. హెచ్ఎంకే సర్వీస్ సెంటర్లో వివిధ కంపెనీలకు చెందిన కార్లు రిపేర్ మరియు సర్వీసింగ్ కోసం కస్టమర్లు ఇచ్చారు. గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. అయితే, సర్వీస్ సెంటర్లో టైర్లు, ఇంజిన్ ఆయిల్ వంటి త్వరగా మండుకునే పదార్థాలు ఉండటంతో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేలోపే అక్కడ ఉన్న విలువైన కార్లన్నీ అస్థిపంజరాలుగా మారిపోయాయి.
షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సర్వీసింగ్ సెంటర్లో తగినన్ని అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా లేదా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. జాతీయ రహదారి వెంబడి ఈ ప్రమాదం జరగడంతో అటుగా వెళ్లే వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సర్వీసింగ్ కోసం తమ వాహనాలను ఇచ్చిన యజమానులు, ఈ వార్త విని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.
#Vijayapura #FireAccident #CarServiceCentre #BreakingNews #Karnataka #SafetyFirst