April 4, 2026

యూసీసీతో మహిళలకు సరికొత్త హక్కులు!

UNIFORM CIVIL CODE

UNIFORM CIVIL CODE

దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి (UCC) అమలుపై చర్చ ముమ్మరమైంది. ఒకే దేశం-ఒకే చట్టం అనే నినాదంతో వస్తున్న ఈ బిల్లు, ముఖ్యంగా మహిళల సామాజిక స్థితిగతుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని ప్రభుత్వం భావిస్తోంది. “ఒకే ఇంట్లో ఇద్దరు వ్యక్తులకు రెండు రకాల చట్టాలు ఉంటే ఆ ఇల్లు గడవదు” అని ప్రధాని మోదీ పేర్కొంటూ, చట్టం ముందు అందరూ సమానులేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో యూసీసీ ద్వారా మహిళలకు లభించే హక్కులు, నిపుణుల విశ్లేషణలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

యూసీసీ అమలులోకి వస్తే మతంతో సంబంధం లేకుండా ప్రతి మహిళకు వారసత్వ ఆస్తిలో సమాన వాటా లభిస్తుంది. వివాహం ఏ ఆచారాల ప్రకారం చేసుకున్నా, దానిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఇకపై తప్పనిసరి. అలాగే, ఏ మతానికి చెందిన వారైనా సరే, మొదటి భార్య ఉండగా రెండో వివాహం చేసుకోవడం చట్టరీత్యా నేరం అవుతుంది. భర్త విడిచిపెట్టిన మహిళలకు న్యాయం చేసేలా, వారికి భరణం పొందే హక్కును ఈ చట్టం కల్పిస్తోంది.

వికసిత్ భారత్’ లక్ష్య సాధన కోసం ప్రజా సేవల్లో నిరంతర అప్‌డేట్ అవసరం: పీఎం మోదీ ఈ వార్తను కూడా చదవండి

కొత్త చట్టంలో అత్యంత కీలకమైన అంశం లివ్-ఇన్ రిలేషన్‌షిప్. ఈ సంబంధంలో ఉన్న వారు తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఒకవేళ భాగస్వామి వదిలేస్తే, ఆ మహిళ భరణం పొందేందుకు అర్హురాలు. అంతేకాకుండా, ఈ సంబంధం ద్వారా జన్మించిన బిడ్డలకు కూడా పూర్తి వారసత్వ హక్కులు లభిస్తాయి. అయితే, 18-21 ఏళ్ల లోపు యువత లివ్-ఇన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారి తల్లిదండ్రులకు సమాచారం అందించాలనే నిబంధన సామాజికంగా చర్చనీయాంశమైంది.

ఇప్పటివరకు కొన్ని కులాలు, మతాల్లో ఉన్న సామాజిక విడాకుల పద్ధతులకు యూసీసీ స్వస్తి పలుకుతుంది. కేవలం కోర్టు ద్వారా మంజూరయ్యే విడాకులు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. అయితే, దీనివల్ల ఫ్యామిలీ కోర్టుల్లో కేసుల భారం పెరుగుతుందని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక పద్ధతుల్లో త్వరగా ముగిసే విడాకుల ప్రక్రియ, కోర్టుల వల్ల ఏళ్ల తరబడి సాగవచ్చని రిటైర్డ్ జడ్జి జ్యోత్స్నా యాజ్ఞిక్ అభిప్రాయపడ్డారు.

యూసీసీ వల్ల మహిళలకు మేలు జరుగుతుందని ఒక వర్గం వాదిస్తుంటే, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లకు గుర్తింపునివ్వడం వల్ల సాంప్రదాయ వివాహ వ్యవస్థ బలహీనపడుతుందని మరికొందరు హెచ్చరిస్తున్నారు. లివ్-ఇన్ సంబంధాల వల్ల కొత్త చట్టపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉందని న్యాయవాది పూజా ప్రజాపతి పేర్కొన్నారు. ఏదేమైనా, వివాహం జరిగిన ఏడాది తర్వాతే విడాకులకు దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనలు కుటుంబ వ్యవస్థను కాపాడతాయని భావిస్తున్నారు.

#UCC #UniformCivil Code #WomenEmpowerment #LegalRights #PMModi #IndiaNews #CivilRights #LawUpdate

వికసిత్ భారత్’ లక్ష్య సాధన కోసం ప్రజా సేవల్లో నిరంతర అప్‌డేట్ అవసరం: పీఎం మోదీ ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *