March 15, 2026

130 మందికి ‘పీఎం ఆవాస్ యోజన 2.0’ మంజూరు పత్రాల పంపిణీ!

తిరుపతి నగరంలో సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదల కల నెరవేరబోతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY 2.0) పథకం కింద ఎంపికైన అర్హులైన లబ్ధిదారులకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య గురువారం మంజూరు పత్రాలను అందజేశారు. గత ఏడాది దరఖాస్తు చేసుకున్న వారిలో నిబంధనల ప్రకారం అర్హత పొందిన వారికి ఈ పత్రాలను పంపిణీ చేశారు.

లబ్ధిదారులకు రూ. 2.50 లక్షల ఆర్థిక సాయం

ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ.. తిరుపతి నగరంలో సొంత స్థలం కలిగి ఉండి 2025లో దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు 130 మందిని ఈ పథకానికి ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఒక్కో లబ్ధిదారునికి కేంద్ర ప్రభుత్వం రూ. 1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.00 లక్ష.. మొత్తం కలిపి రూ. 2.50 లక్షల రూపాయల సబ్సిడీని నేరుగా అందజేస్తామని వివరించారు. లబ్ధిదారులు ఈ మొత్తంతో పాటు మరికొంత సొంత నిధులను వెచ్చించి నాణ్యమైన ఇంటిని నిర్మించుకోవాలని కోరారు.

ఈనెల 31లోపు పనులు ప్రారంభించాలి

మంజూరు పత్రాలు అందుకున్న వారందరూ నిబంధనల ప్రకారం గడువులోగా నిర్మాణ పనులు ప్రారంభించాలని కమిషనర్ సూచించారు. ఈ నెల 31వ తేదీలోపు పునాది పనులు మొదలుపెట్టాలని, తద్వారా నిధుల విడుదల ప్రక్రియ వేగంగా జరుగుతుందని స్పష్టం చేశారు. సొంతింటి నిర్మాణంలో లబ్ధిదారులకు అవసరమైన సాంకేతిక సలహాలను అధికారుల నుంచి పొందవచ్చని సూచించారు.

అధికారుల పర్యవేక్షణలో పారదర్శకంగా ఎంపిక

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, జిల్లా హౌసింగ్ పిడి శ్రీనివాసరావు, ఈఈ శ్రీరాములు రెడ్డి మరియు ఇతర హౌసింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హులను అత్యంత పారదర్శకంగా ఎంపిక చేశామని అధికారులు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకుని లబ్ధిదారులు తమ సొంతింటి కలను నిజం చేసుకోవాలని వారు ఆకాంక్షించారు.

#PMAY #Tirupati #HousingScheme #CentralGovt #HomeConstruction #MunicipalCorporation #TirupatiNews #PradhanMantriAwasYojana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *