March 10, 2026

టెకీ నుంచి గంజాయి స్మగ్లర్ వరకు.. ఏపీలో యువతను మింగేస్తున్న మత్తు కోరలు!

ఆంధ్రప్రదేశ్ మత్తు పదార్థాల అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోంది. ఒకప్పుడు కేవలం నిరక్షరాస్యులు, నేరచరితులు మాత్రమే ఈ రొంపిలోకి దిగేవారు. కానీ ఇప్పుడు ఉన్నత చదువులు చదివిన వారు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం గంజాయి స్మగ్లింగ్‌లో పట్టుబడటం కలకలం రేపుతోంది. నాతవరం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 74 కేజీల గంజాయితో పాటు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను అరెస్ట్ చేయడం రాష్ట్రంలో మత్తు నెట్‌వర్క్ ఎంత లోతుగా పాకిందో స్పష్టం చేస్తోంది. కేవలం డబ్బు ఆశతో తన కెరీర్‌ను పణంగా పెట్టి, అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో భాగస్వామిగా మారిన ఈ ఉదంతం నేటి యువత ఏ దారిలో వెళ్తుందో చెప్పకనే చెబుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన టెకీ రేణుక, తమిళనాడుకు చెందిన తన అనుచరులతో కలిసి ఒడిశా నుంచి ఏజెన్సీ మార్గాల ద్వారా గంజాయిని తరలిస్తూ పట్టుబడటం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సంచలనం సృష్టించింది.

కేవలం విశాఖ ఏజెన్సీ మాత్రమే కాకుండా, రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు మరియు ఆధ్యాత్మిక నగరం తిరుపతిలలో కూడా గంజాయి విక్రయాలు ఆందోళనకరంగా మారుతున్నాయి. తిరుపతి నుంచి తమిళనాడు వరకూ ముఠాలు గంజాయి సరఫరాను సాగిస్తున్నాయి. ఎన్నో సందర్భాలలో పట్టుబడిన విషయంతెలిసిందే. తిరుపతిలోని మంగళం, తిరుచానూరు, చంద్రగిరి ప్రాంతాలు దీనికి కీలక కేంద్రాలుగా ఉన్నాయి. కర్నూలు జిల్లాలో పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు గంజాయి తరలించే ప్రధాన మార్గంగా మారుతుండగా, తిరుపతిలో విద్యార్థులే లక్ష్యంగా స్మగ్లర్లు పాగా వేస్తున్నారు. తిరుపతిలోని విద్యాసంస్థల పరిసరాల్లో గంజాయి చిన్న చిన్న పొట్లాలుగా (ప్యాకెట్లు) విక్రయిస్తున్న ముఠాలను పోలీసులు తరచుగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు పెరగడంపై భక్తులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నుంచి తిరుపతి, కర్నూలు వరకు విస్తరించిన ఈ మత్తు గొలుసుకట్టు వ్యాపారం యువతను నిర్వీర్యం చేస్తోంది.

రౌడీషీటర్ల దందా – నగరాలను కమ్మేస్తున్న గంజాయి పొగ

రాష్ట్రవ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా వెనుక రౌడీషీటర్ల హస్తం కీలకంగా మారింది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో రౌడీషీటర్లు గంజాయిని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. విజయవాడ నగరంలో ఉన్న సుమారు 470 మంది రౌడీషీటర్లలో 130 మందికి పైగా క్రియాశీలకంగా ఉంటూ, ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని తెప్పించి విద్యార్థులకు, యువతకు అలవాటు చేస్తున్నారు. హేమంత్ అలియాస్ నాని వంటి రౌడీషీటర్లు ఆటోల్లో తిరుగుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ డోర్ డెలివరీ చేస్తున్న తీరు పోలీసుల నిఘా లోపాన్ని ఎత్తిచూపుతోంది. విశాఖపట్నంలో గత కొన్ని నెలలుగా గంజాయి విక్రయిస్తున్న పదుల సంఖ్యలో రౌడీషీటర్లపై పోలీసులు పీడీ యాక్టులు ప్రయోగిస్తున్నా, మార్కెట్‌లో సరఫరా మాత్రం తగ్గడం లేదు.

కర్నూలులో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాల (సింథటిక్ డ్రగ్స్) వినియోగం కూడా పెరుగుతుండటం గమనార్హం. నగర బహిష్కరణకు గురైన వారు శివారు ప్రాంతాల్లో మకాం వేసి, జిల్లాల సరిహద్దుల్లోని సమన్వయ లోపాన్ని అడ్డం పెట్టుకుని తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. విజయవాడకు ఆనుకుని ఉన్న తాడేపల్లి, పెనమలూరు వంటి ప్రాంతాల్లో తలదాచుకుంటున్న రౌడీషీటర్లు అర్థరాత్రి వేళల్లో గంజాయి వ్యాపారాన్ని సాగిస్తున్నారు. తిరుపతిలో అయితే హాస్టల్స్, ప్రైవేట్ విద్యాసంస్థలే లక్ష్యంగా ముఠాలు పనిచేస్తున్నాయి. రౌడీషీటర్లకు గంజాయి విక్రయాల ద్వారా వచ్చే భారీ ఆదాయం వారి నేర సామ్రాజ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు దోహదపడుతోంది.

ఏజెన్సీ నుంచి శ్రీలంక వరకు – గంజాయి రవాణా గొలుసుకట్టు!

ఏపీలోని అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు గంజాయి సాగు మరియు రవాణాకు ప్రధాన మార్గాలుగా మారాయి. ఒడిశాలోని బలమెల ప్రాంతంలో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఏజెన్సీ మార్గాల ద్వారా మైదాన ప్రాంతాలకు చేర్చడం ఈ ముఠాల ప్రధాన వ్యూహం. ఇక్కడి నుంచి తమిళనాడులోని రామనాథపురం, తంజావూరు జిల్లాలకు, అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా శ్రీలంకకు గంజాయిని ఎగుమతి చేస్తున్నారు. పట్టుబడిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రేణుక ముఠాలో తమిళనాడుకు చెందిన వ్యక్తులు ఉండటమే దీనికి నిదర్శనం. వీరు కేజీ గంజాయిని రూ. 25 వేల వరకు లాభానికి విక్రయిస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారు.

ప్రభుత్వం గంజాయిపై ఎంత ఉక్కుపాదం మోపుతున్నామని చెబుతున్నా, కొత్త కొత్త రూపాల్లో స్మగ్లర్లు పుట్టుకొస్తూనే ఉన్నారు. విశాఖ పోర్ట్ ద్వారా, తిరుపతి మీదుగా చెన్నైకి వెళ్లే రైళ్ల ద్వారా గంజాయి అక్రమ రవాణా జరుగుతోంది. పోలీసులు వాహన తనిఖీల్లో పట్టుకుంటున్నది కేవలం గోరంత మాత్రమేనని, కళ్లుగప్పి వెళ్తున్నది కొండంత అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువతను నిర్వీర్యం చేస్తున్న ఈ మత్తు దందాను అరికట్టాలంటే కేవలం అరెస్టులతో సరిపెట్టకుండా, సరిహద్దుల వద్ద డ్రోన్ నిఘా మరియు జిల్లాల మధ్య పటిష్టమైన పోలీసు సమన్వయం అవసరం. లేనిపక్షంలో ఉన్నత విద్యావంతులు కూడా ఈ నేర ప్రపంచంలోకి ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంది.

Software Engineer, Ganja Smuggling, Vizag Agency, Tirupati Crime, Kurnool Narcotics,Rowdy Sheeter, Instagram Drug Deals, AP Police, International Link, Youth Addiction

#GanjaSmuggling
#NarcoticsTrade
#VizagPolitics
#TirupatiNews
#KurnoolCrime
#BreakingNews

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *