
ప్రజాస్వామ్య దేశంలోని ఆంధ్రప్రదేశ్ అనే ఒక్క రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, ఇప్పటికే వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేశారని, తమ రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా అన్ని వ్యవస్థలను నడిపిస్తున్నారని వైయస్ఆర్సీపీ కో-ఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. నెల్లూరులో శనివారం ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు.
తరువాత మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ముందు చెప్పినట్లుగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తామని పదే పదే కూటమి నాయకులు చెబుతుంటే ఏదో అనుకున్నామని, ఆ రాజ్యాంగం ఇంతదారుణంగా ప్రజాస్వామ్యానికి పాతర వేసే విధంగా ఉంటుందని తాము ఊహించలేదని, గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. వ్యవస్థలన్నింటిని చేతిలోకి తీసుకుని ఒక పద్దతి ప్రకారం తప్పుడు కేసులు బనాయిస్తూ నాయకులను, తమకు ఎదురు చెప్పిన వారిని వేధించే తీరు చూస్తే దిగ్భ్రాంతి కలుగుతోందని అన్నారు.
ఈనాడు, ఆంధ్రజ్యోతులలో వార్త రాయడం వారు రాసిన విధంగానే వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు పెట్టడం ఎక్కడ ఉన్నవారిని పట్టుకు రావడంతో జైళ్ళలో తోయడం ఇదే రెడ్ బుక్ రాజ్యాంగంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు మరీ దిగజారిపోయారని అన్నారు. తెనాలిలో యువకులను నడిరోడ్డుపై అరికాళ్ళపై కొట్టిన తీరు జుగుప్సాకరంగా ఉందన్నారు. తప్పు చేసి ఉంటే దానికి అనుగుణంగా కేసులు నమోదు చేసి కోర్టు ముందు హాజరు పరిచి వారికి తగిన శిక్ష పడేలా చూస్తారుగానీ, ఇలా లాఠీలు మార్చి మార్చి కొట్టడమనేది అత్యంత హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు.
LIVE: నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డికి వైయస్ఆర్సీపీ కో-ఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీనేతలుపరామర్శ https://t.co/3FztGfvmoS
— YSR Congress Party (@YSRCParty) May 31, 2025
ఇక మరో నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఆశ్లీల నృత్యాలను బహిరంగంగా నిర్వహించడం అందునా ఓ పర్వదిన సందర్భంగా నిర్వహించడం దేనికి సూచిక అని ఆయన ప్రశ్నించారు. అసలు ఆంధ్రప్రదేశ్లో పాలన ఎక్కడికి వెళ్ళుతోందని అడిగారు. పాలన పూర్తిగా గాడి తప్పిందని ఆయన విమర్శించారు.