March 10, 2026

ప్రాజెక్టు ఒకటే.. ప్రభుత్వానికో పేరు ! పోలవరం వేదికగా మళ్ళీ చర్చ!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల పేర్లు మారిపోవడం ఒక ఆనవాయితీగా మారింది. పాలన మారినా ప్రజల అవసరాలు మారవు, కానీ ఆ అవసరాలను తీర్చే పథకాలకు మాత్రం కొత్త పేర్లు తగిలించడం రాజకీయ సంస్కృతిగా మారిందన్న విమర్శలు ‘పోలవరం’ సాక్షిగా ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు ‘అమరజీవి పొట్టి శ్రీరాములు’ పేరు పెట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రతిపాదన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావులను గౌరవించుకోవాలన్న ఉద్దేశ్యం ప్రశంసనీయమే అయినప్పటికీ, ఇది పాత రాజకీయ సంప్రదాయానికి కొనసాగింపేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తొలుత ఎటువంటి రాజకీయ రంగు లేకుండా కేవలం ‘పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు’గా పిలవబడిన ఈ ప్రాజెక్టుకు, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ‘ఇందిరా సాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టు’గా పేరు మార్చారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో మళ్ళీ ‘పోలవరం’ అనే పేరే వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ ప్రతిపాదనకు జనసేన నేత నాగబాబు కూడా మద్దతు ప్రకటించారు. గతంలో రాజకీయ నాయకుల పేర్లు పెట్టడాన్ని తప్పుబట్టిన వారు, ఇప్పుడు పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల పేర్లు పెట్టడం సముచితమని వాదిస్తున్నారు. అయితే, పేరు ఏదైనా ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందనేదే ప్రజల అసలు ఆకాంక్ష. ప్రజల ప్రశ్న. అదే వారికి ముఖ్యం. అది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేరుగానీ, పేరు మార్చాలని ప్రతిపాదనను తెరపైకి తెచ్చి మళ్ళీ పోలవరం ప్రాజెక్టును మరోమారు చర్చకీడ్చుతున్నారు.

సంక్షేమంలోనూ ‘పేర్ల’ గోల!

కేవలం భారీ నీటిపారుదల ప్రాజెక్టులే కాకుండా, సామాన్యులకు అందే సంక్షేమ పథకాలు కూడా ఈ నామకరణాల చక్రంలో చిక్కుకున్నాయి. విజయవాడ ఆనకట్ట ‘ప్రకాశం బ్యారేజీ’గా మారడం వెనుక ఒక చారిత్రక గౌరవం ఉన్నప్పటికీ, ఇతర పథకాల పేర్లు మాత్రం ప్రతి ఐదేళ్లకు ఒకసారి మారుతూనే ఉన్నాయి. ఉదాహరణకు, ఆరోగ్య బీమా పథకం కాంగ్రెస్ హయాంలో ‘ఆరోగ్యశ్రీ’గా ఉంటే, టీడీపీ హయాంలో ‘ఎన్టీఆర్ వైద్య సేవ’గా, వైసీపీ హయాంలో ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’గా రూపాంతరం చెందింది. రైతులకు అందించే ఆర్థిక సాయం కూడా ‘అన్నదాత సుఖీభవ’ నుంచి ‘రైతు భరోసా’ వరకు రకరకాల పేర్లతో ప్రయాణించింది.

వృద్ధాప్య పింఛన్లు, గృహ నిర్మాణ పథకాలు కూడా ఇదే కోవలోకి వస్తాయి. ‘ఇందిరమ్మ ఇళ్లు’, ‘ఎన్టీఆర్ గృహ నిర్మాణం’, ‘పేదలందరికీ ఇళ్లు’.. ఇలా పేర్లు మారుతున్నాయే తప్ప లబ్ధిదారుల అవసరాలు మాత్రం అవే ఉంటున్నాయి. ప్రాజెక్టులు లేదా పథకాలు ఏ పేరు మీద అమలవుతున్నాయనే దానికంటే, అవి ఎంత సమర్థవంతంగా అమలవుతున్నాయన్నదే ప్రజాస్వామ్యంలో ముఖ్యం.

పథకం ఉద్దేశ్యం కాంగ్రెస్ హయాం (వైఎస్సార్/ఇతర) టీడీపీ హయాం (2014-19) వైసీపీ హయాం (2019-24) ప్రస్తుత కూటమి ప్రభుత్వం (2024 – )
ఆరోగ్య బీమా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ (ప్రస్తుతానికి)
రైతు ఆర్థిక సాయం అన్నదాత సుఖీభవ వైఎస్సార్ రైతు భరోసా అన్నదాత సుఖీభవ
సామాజిక పింఛన్లు ఇందిరమ్మ పింఛన్లు ఎన్టీఆర్ భరోసా వైఎస్సార్ పెన్షన్ కానుక ఎన్టీఆర్ భరోసా
మధ్యాహ్న భోజనం మధ్యాహ్న భోజన పథకం అక్షయ పాత్ర / గొరుముద్ద జగనన్న గోరుముద్ద డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం
పేదల ఇళ్లు ఇందిరమ్మ ఇళ్లు ఎన్టీఆర్ గృహ నిర్మాణం నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పి.ఎం. ఆవాస్ యోజన – ఎన్టీఆర్ గృహ నిర్మాణం
తల్లి – బిడ్డ సాయం తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వైఎస్సార్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్
విద్యార్థుల కిట్లు విద్యా కానుక జగనన్న విద్యా కానుక సర్వపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్
తల్లికి వందనం అమ్మ ఒడి తల్లికి వందనం

ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పేరు పెట్టాలన్న ప్రతిపాదన గౌరవప్రదమే అయినప్పటికీ, మళ్ళీ పేరు మార్పు జరగడం రాజకీయ నామకరణాల పరంపరలో మరో అధ్యాయమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి కావడమే అన్నిటికంటే పెద్ద గౌరవమని ప్రజలు కోరుకుంటున్నారు.
#Polavaram #PottiSriramulu #APPolitics #PawanKalyan #NarendraModi #BreakingNews

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *