ప్రకాశం జిల్లాలో పర్యాటక పండగ..
- ఈ నెల 14, 15 తేదీల్లో వైభవంగా ‘పాకల బీచ్ ఫెస్టివల్’!
ప్రకాశం జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పాకల బీచ్ సరికొత్త హంగులతో పర్యాటకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ‘పాకల బీచ్ ఫెస్టివల్’ను అద్భుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న 100 ప్రముఖ బీచ్లలో పాకల బీచ్ను ఒకటిగా అభివృద్ధి చేశామని, పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేస్తూ దీనిని అత్యంత సురక్షిత తీరంగా తీర్చిదిద్దామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు.
అబ్బురపరిచే సాహస క్రీడలు, వినోద కార్యక్రమాలు
పాకల బీచ్ ఫెస్టివల్కు వచ్చే పర్యాటకుల కోసం ప్రభుత్వం ఈసారి ప్రత్యేక ఆకర్షణలను సిద్ధం చేసింది. హెలికాప్టర్ రైడింగ్, పారా రైడింగ్, బోట్ రైడింగ్ వంటి సాహస క్రీడలతో పాటు బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ వంటి క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. వీటితో పాటు నోరూరించే పిండివంటలతో ఫుడ్ స్టాల్స్, కనువిందు చేసే సాంస్కృతిక ప్రదర్శనలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనున్నాయి. ఇప్పటికే సంక్రాంతి సమయంలో వేలాది మంది సందర్శకులు ఇక్కడికి రావడం విశేషం.
స్వచ్ఛ పాకల.. పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్న మంత్రి, కలెక్టర్
బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ఆదివారం ఉదయం మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీలు కలిసి ప్రచార వీడియో (AV)ని విడుదల చేశారు. అనంతరం ‘స్వచ్ఛ పాకల’ కార్యక్రమంలో భాగంగా మంత్రి, అధికారులు స్వయంగా బీచ్లో పారిశుద్ధ్య పనుల్లో పాల్గొని తీరాన్ని శుభ్రం చేశారు. విద్యార్థులను పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
సేఫ్టీ ఫస్ట్.. ప్రాణనష్టం లేని సురక్షిత తీరం
పర్యాటకుల భద్రత విషయంలో పాకల బీచ్ ఆదర్శంగా నిలిచిందని మంత్రి గుర్తుచేశారు. బీచ్లో ఏర్పాటు చేసిన బే వాచ్ టవర్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించడం వల్లే ఈ ఏడాది ఒక్క మరణం కూడా సంభవించలేదని ఆయన తెలిపారు. విశాఖపట్నం బీచ్ తరహాలో ఇక్కడ సిమెంట్ రోడ్లు, పారమిట్ వాల్ నిర్మాణాలు చేపట్టామని, పర్యాటకులు తమ కుటుంబాలతో కలిసి ధైర్యంగా వచ్చి ఇక్కడ సమయాన్ని గడపవచ్చని కలెక్టర్ పి. రాజాబాబు సూచించారు.
ఒంగోలు, కందుకూరులో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు
బీచ్ ఫెస్టివల్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో కర్టన్ రైజర్ ప్రోగ్రామ్, 10వ తేదీన కందుకూరు, కనిగిరి, పొదిలి ప్రాంతాల్లో ‘2కె రన్’ నిర్వహించనున్నారు. పర్యాటక రంగంలో పాకల బీచ్ను రాష్ట్రంలోనే మొదటి పది స్థానాల్లో నిలపడమే లక్ష్యమని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ వెల్లడించారు.
#PakalaBeach #BeachFestival2026 #PrakasamTourism #APTourism #DolaBalaVeeranjaneyaSwamy #SafeBeach #VisitAndhraPradesh
