March 27, 2026

శైవక్షేత్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు

మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రధాన దేవాలయాలు, ఘాట్లు మరియు తీర ప్రాంతాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. రథోత్సవాలు, తిరునాళ్లలో జనం రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. క్యూలైన్లు, ఎంట్రీ మరియు ఎగ్జిట్ గేట్ల వద్ద భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక సిబ్బందిని మోహరిస్తున్నట్లు బుధవారం మీడియాకు వివరించారు.

ట్రాఫిక్ మళ్లింపు.. పార్కింగ్‌కు ప్రత్యేక ప్రణాళిక

దర్శనానికి వచ్చే భక్తులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జిల్లావ్యాప్తంగా ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికను సిద్ధం చేశారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించాలని, భక్తులకు మార్గదర్శనం చేసేలా సైన్ బోర్డులు, సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రధాన రహదారుల వద్ద రద్దీని క్రమబద్ధీకరించడం ద్వారా భక్తులు వేగంగా, సురక్షితంగా ఆలయాలకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

డ్రోన్లు, సీసీ కెమెరాలతో డేగ కన్ను

వేడుకల్లో అసాంఘిక శక్తుల కదలికలను నిరోధించడానికి సాంకేతికతను భారీగా వాడుతున్నారు. అత్యధిక రద్దీ ఉండే ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు, సీసీటీవీల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. తొక్కేసలాట వంటి ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్‌లను సిద్ధం చేశారు. దేవాదాయ, రెవెన్యూ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పండుగను ప్రశాంతంగా నిర్వహించేలా ప్లాన్ చేశారు.

పోలీసులకు సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి

దర్శనానికి వచ్చే భక్తులు పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 లేదా 112 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేయగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

#Mahashivaratri #PoliceSecurity #Devotional #PublicSafety #FestivalUpdates #Vigilance #SafeShivaratri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *