March 25, 2026

పేదల భద్రతే కూటమి ప్రభుత్వ ధ్యేయం

  • ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో మానవతా సంకల్పం
  • ఇంటింటికి న్యాయం – ఇంటి ముంగిల్లో పెన్షన్

పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆర్థికంగా వెనుకబడ్డవారికి భద్రతను కల్పించాలనే సంకల్పంతో పౌర సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఇంటి ముంగిట్లోకి విస్తరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు పట్టణంలోని 4వ, 8వ వార్డుల్లో లబ్ధిదారులకు శనివారం స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. ఆయన కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు.

“ఇంత పారదర్శకంగా, త్వరితగతిన పంపిణీ చేయడం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో దీనిపై నిర్లక్ష్యం కనిపించింది. కానీ ఇప్పుడు పేదల అభ్యున్నతి కోసం మేము పని చేస్తున్నాం,” అని మంత్రి పేర్కొన్నారు. జూన్ 1 ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్లను అందజేస్తున్నట్లు వివరించారు. ఎటువంటి అవకతవకలు లేకుండా, కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని చెప్పారు.

ఒక్కో హామీ నెరవేరుస్తున్నాం: మంత్రి దుర్గేష్

“చాలీచాలని పెన్షన్లతో కాలం గడిపిన పేదలకు ఇప్పుడు గౌరవమైన జీవితం దక్కుతోంది” అని మంత్రి దుర్గేష్ చెప్పారు. “గత  ప్రభుత్వం రూ.2,000 పెన్షన్‌ను రూ.3,000 చేయడానికే ఐదేళ్లు తీసుకుంటే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.4,000గా పెంచాము. దివ్యాంగులకు రూ.6,000, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.15,000 పెన్షన్లు అందజేస్తున్నాం,” అని తెలిపారు.

ఆర్థికంగా వెనుకబడి ఉన్నా కూడా ప్రజల సంక్షేమం కోసం వెనకడుగు వేయలేదన్నారు. “కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్లు నిలిపేస్తారన్న వాదనలను తిప్పికొట్టాం. ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాం. తల్లికి వందనం, ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను కూడా వేగంగా అమలు చేయబోతున్నాం” అని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *