March 10, 2026

ఇజ్రాయెల్ అణు దాడి చేస్తే… పాకిస్తాన్‌ ద్వారా ప్రతీకారం : ఇరాన్

టెహ్రాన్, జూన్ 17:  ఇజ్రాయెల్ తమపై అణు దాడికి దిగితే పాకిస్తాన్ ద్వారా అణు ప్రతీకారం తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ అగ్రశ్రేణి జనరల్ మోహ్సెన్ రెజాయీ పేర్కొనడం అంతర్జాతీయంగా కలకలం రేగింది. ఇది ఎక్కడ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  “ఇజ్రాయెల్ అణు క్షిపణులు ఉపయోగిస్తే, పాకిస్తాన్ కూడా అణు ఆయుధాలతో దాడి చేస్తుందని వారు మాకు తెలిపారు,” అని రెజాయీ ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇప్పటికే ఇరాన్‌లోని అణు స్థావరాలపై ఇజ్రాయిల్ దాడి చేస్తున్న విషయం తెలిసిందే. కొన్నింటిని నాశనం చేసింది. వాటిని వినియోగించడానికి వీలు లేకుండా చేసింది. ఇలాంటి తరుణంలో ఇరాన్ ఉన్నతాధికారులు చేసిన ప్రకటన నిజంగానే ప్రకంపనలు రేపుతోంది.  ఇరాన్ చెప్పినట్లు ఇజ్రాయిల్‌పై పాకిస్తాన్ అణు దాడికి దిగితుందా? ఇరాన్‌కు, పాకిస్తాన్‌కు అంత మంచి అవినాభావ సంబంధాలున్నాయా? అనే పరిశీలనలు జరుగుతున్నాయి. మొత్తానికి ఒక కొత్త అవకాశాన్ని ఇరాన్ బయటపెట్టింది.

అబ్బెబ్బె… మేము అలా చేయం.. కట్టుబడి ఉంటాం : పాకిస్తాన్

ఇరాన్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్ రంగంలోకి దిగి, తాము అణు ఆయుధాలు వారధి కాదు, నిరోధక శక్తి (deterrent) మాత్రమేనని స్పష్టం చేశారు. “పాకిస్తాన్ అన్ని అంతర్జాతీయ అణు ఒప్పందాలకు కట్టుబడి ఉంది,” అని ఆయన పేర్కొన్నారు. అయితే ఇజ్రాయెల్ చర్యల పట్ల పాకిస్తాన్ ఇటీవలంతగా ఇరాన్‌కు మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో, దౌత్యపరమైన దృక్కోణం (diplomatic alignment) స్పష్టంగా కనిపిస్తోంది. ఈ భరోసాతోనే ఇరాన్ కూడా ధైర్యంగా పాకిస్తాన్ అణుదాడికి సంబంధించిన ప్రకటన చేసింది.

అయితే అమెరికా ఇజ్రాయిల్‌కు మిత్రదేశం కావడంతో అటువైపు నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయోననే భయంతో పాకిస్తాన్ వెంటనే చేతులెత్తేసింది. ఇప్పటికే భారత దేశం చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అణుదాడికి తాము పాల్పడే అవకాశల్లేవని, అంతర్జాతీయ అణు ఒప్పందాలకు కట్టుబడి ఉంటామని తేల్చి చెప్పేసింది.

పాకిస్తాన్‌తో ఇజ్రాయిల్‌కు పొంచి ఉన్న ప్రమాదం

ఇరాన్ అంత తేలికగా అయితే అణు ప్రకటన చేసే అవకాశం ఉండదు. చేసిందంటే ఇరు దేశాల నడుమ ఎంతో కొంత చర్చ జరిగే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.  పాకిస్తాన్ వద్ద ఉన్న షాహీన్-III క్షిపణికి 2,700 కి.మీ. పరిధి ఉండటంతో అది ఇజ్రాయెల్‌ను చేరగలదని మిలిటరీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది పూర్తిగా కార్యాచరణలో (fully operational) ఉందని చెబుతున్నా, అధికారిక స్థాయిలో ఇంకా మోహరింపు జరగలేదని సమాచారం.
ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అనేక మంది ఇరాన్ రక్షణ సైనికులు (IRGC commanders), అణు శాస్త్రవేత్తలు హతమయ్యారని సమాచారం. ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ నుంచి క్షిపణుల వర్షం కురవడంతో ఐదుగురు ఇజ్రాయెల్ పౌరులు మరణించారు.

యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఉద్రిక్తతలపై స్పందిస్తూ, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమెనీ హత్యను నివారించాల్సిందిగా ఇజ్రాయెల్‌కు సలహా ఇచ్చినట్టు తెలిసింది. ఇది ఇలా ఉండగా, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో మాట్లాడి, ఇజ్రాయెల్ చర్యలను సార్వభౌమత్వానికి విరుద్ధంగా (violation of sovereignty) పేర్కొన్నారు.

ముస్లిం దేశాలు ఇజ్రాయెల్‌తో సంబంధాలు తెంచుకోవాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్, OIC అత్యవసర సమావేశం (urgent OIC summit) ఏర్పాటు చేయాలని పార్లమెంట్‌లో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *