March 24, 2026

76 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘనవిజయం!

టీ20 ప్రపంచకప్ సూపర్-8 పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమైన భారత్.. 188 పరుగుల లక్ష్య ఛేదనలో చేతులెత్తేసింది. శివం దూబె మినహా మిగిలిన బ్యాటర్లందరూ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో భారత్ 111 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమితో భారత్ సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారగా, నెట్ రన్ రేట్ కూడా దారుణంగా పడిపోయింది.

సఫారీ బ్యాటర్ల ఊచకోత.. మిల్లర్ మెరుపులు

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు భారత్ ఆరంభంలోనే షాక్ ఇచ్చింది. బుమ్రా, అర్ష్‌దీప్ ధాటికి 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో డేవిడ్ మిల్లర్ (63), డెవాల్డ్ బ్రెవిస్ (45) ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ముఖ్యంగా మిల్లర్ భారత స్పిన్నర్లపై విరుచుకుపడుతూ కేవలం 26 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (44 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగుల భారీ స్కోరు సాధించింది.

కుప్పకూలిన భారత బ్యాటింగ్ లైనప్

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (0), తిలక్ వర్మ (1)లు మార్‌క్రామ్ బౌలింగ్‌లో స్వల్ప వ్యవధిలోనే అవుట్ కాగా, అభిషేక్ శర్మ (15) కూడా నిరాశపరిచాడు. పవర్‌ప్లే ముగిసేసరికి 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (18) క్రీజులో ఉన్నంత సేపు నెమ్మదిగా ఆడగా, ఒత్తిడిలో భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు.

దూబె పోరాటం వృథా.. సెమీస్ చేరడం కష్టమేనా?

మధ్య ఓవర్లలో కేశవ్ మహరాజ్, మార్కో యాన్సెన్ వరుస వికెట్లతో భారత్‌ను కోలుకోనీయలేదు. హార్దిక్ పాండ్య (18), రింకు సింగ్ (0) విఫలం కావడంతో ఓటమి ఖాయమైంది. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా శివం దూబె (42) మూడు సిక్సర్లతో ఒంటరి పోరాటం చేసినా అది ఓటమి అంతరాన్ని తగ్గించడానికే పరిమితమైంది. ఈ ఓటమితో భారత్ తన తదుపరి మ్యాచ్‌లలో జింబాబ్వే, వెస్టిండీస్‌లపై భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్ రేసులో నిలుస్తుంది.

#INDvsSA #T20WorldCup2026 #TeamIndia #David Miller #Super8 #CricketTelugu #Bumrah #SuryakumarYadav #ProteasWin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *