
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్ట్ (Cargo Airport) కు వ్యతిరేకంగా లక్ష మంది నుంచి సంతకాలు సేకరించాలని నిర్ణయించినట్లు రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రకటించారు. పలాసలోని ఓ కళ్యాణమండపంలో జరిగిన ఈ సమావేశానికి కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర. వాసు, కార్యదర్శి జోగి. అప్పారావు అధ్యక్షత వహించారు. బలవంతపు భూసేకరణ (forced land acquisition) కి వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని వక్తలు హెచ్చరించారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్ పార్టీ నేత మద్దిల రామారావు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహనరావు మాట్లాడుతూ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం ఇవ్వాలన్నారు. “పలాస నుండి ఒక్క రైలు ఇతర ప్రాంతాలకు పంపలేని మీరెందుకు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో భూములను లాక్కొంటున్నారు?” అని ప్రశ్నించారు.
పర్యావరణ దినోత్సవం రోజే మొక్కలు నాటిన మంత్రి, అదే సమయంలో వేల చెట్లను నరికించే ప్రాజెక్టుకు పాల్పడటాన్ని వక్తలు తీవ్రంగా విమర్శించారు. “ప్రాజెక్టులు పూర్తి చేయడం, వంశధార నీటిని భూముల చివరకు అందించడం, జీడికి గిట్టుబాటు ధర కల్పించడం, ట్రైన్లు నడిపించడం ఇవే జిల్లా ప్రజల డిమాండ్లు. మరి వాటిపై ఎందుకు స్పందించడం లేదు?” అని వారు నిలదీశారు.
ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్. గణపతి, జీడి రైతు సంఘం జిల్లా కార్యదర్శి తేప్పల అజయ్ కుమార్, రైతు కూలీ సంఘం నాయకులు కోనేరు రమేష్, చీకటి ధనంజయ, పొట్టి ధర్మారావు, లండ రామస్వామి, గుంటి లోకనాథం, భోగిరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ ప్రారంభానికి ముందు కళాకారులు కే. హేమ సూదన్, కే. బాలాజీ రావు బృందం ఆటపాటలతో అలరించారు.