March 27, 2026

బీజాపూర్ అడవుల్లో ఎదురుకాల్పులు: ఇద్దరు మావోయిస్టుల మృతి!

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో మరో విజయం లభించింది. శనివారం (17-01-2026) ఉదయం బీజాపూర్ జిల్లా అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.

వ్యూహాత్మక ఆపరేషన్.. గంటల తరబడి కాల్పుల హోరు

నార్త్ వెస్ట్ బీజాపూర్ ప్రాంతంలోని అటవీ కొండల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయనే పక్కా సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), ఎస్టీఎఫ్ మరియు కోబ్రా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. శనివారం తెల్లవారుజాము నుంచే ఇరువర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఇంద్రావతి నేషనల్ పార్క్ పరిసర అటవీ ప్రాంతం. కాల్పులు తగ్గుముఖం పట్టాక సంఘటనా స్థలాన్ని గాలించిన భద్రతా దళాలకు ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. మృతదేహాలతో పాటు అత్యాధునిక ఏకే-47 (AK-47) రైఫిల్స్, భారీగా మందుగుండు సామగ్రి, విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

టార్గెట్ పాపా రావు.. కొనసాగుతున్న గాలింపు

మావోయిస్టు అగ్రనేత, వెస్ట్ బాస్తర్ డివిజన్ కమిటీ ఇన్‌చార్జ్ పాపా రావు (Papa Rao alias Mangu) తన బృందంతో కలిసి ఈ ప్రాంతంలో ఉన్నారనే సమాచారంతోనే ఈ ఆపరేషన్ మొదలైంది. ప్రస్తుతం మరణించిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని, అందులో ఎవరైనా ముఖ్య నేతలు ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బాస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్ రాజ్ ఈ ఎన్‌కౌంటర్‌ను ధృవీకరిస్తూ, ఆపరేషన్ ఇంకా ముగియలేదని, మిగిలిన మావోయిస్టుల కోసం అడవిని జల్లెడ పడుతున్నామని తెలిపారు.

2026 మార్చి నాటికే లక్ష్యం..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్దేశించిన మార్చి 31, 2026 గడువు లోపు బాస్తర్ ప్రాంతాన్ని మావోయిస్టు రహితంగా మార్చేందుకు భద్రతా బలగాలు ‘ఆపరేషన్ కగార్’ను ఉధృతం చేశాయి. ఈ ఏడాది ప్రారంభం (జనవరి 3) నుంచి ఇప్పటివరకు జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో సుమారు 16 మంది మావోయిస్టులు మరణించగా, తాజాగా జరిగిన ఈ ఘటనతో మావోయిస్టు పార్టీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఇదే జిల్లాలో 52 మంది మావోయిస్టులు ఒకేసారి పోలీసుల ఎదుట లొంగిపోవడం గమనార్హం.

#BijapurEncounter #MaoistNews #ChhattisgarhPolice #BastarUpdates #AntiMaoistOperation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *