March 23, 2026

జోగి రమేష్ ఇంటిపై దాడి: ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లపై జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి ప్రేరణగా తెలుస్తోంది. మైలవరం, విజయవాడ పశ్చిమ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వందలాది మంది టీడీపీ శ్రేణులు ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసాన్ని ముట్టడించారు.

ఏం జరిగింది?

ఆందోళనకారులు జోగి రమేష్ ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఇంటి కిటికీలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడమే కాకుండా, పెట్రోల్ బాటిళ్లతో నిప్పంటించారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంటి మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ కమ్మింది. దాడి సమయంలో ఇంట్లో జోగి రమేష్ సతీమణి శకుంతల, తండ్రి మోహనరావు, కుమారుడు రోహిత్ ఉన్నారు. ఈ దాడి జరిగిన సమయంలో జోగి రమేష్ తిరుపతిలోని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఉన్నారు. జైలు నుంచి విడుదలైన చెవిరెడ్డిని పరామర్శించేందుకు ఆయన అక్కడికి వెళ్లారు.

“నా ఇంటి నుంచి నీ ఇంటికి ఎంత దూరమో.. నీ ఇంటి నుంచి నా ఇంటికి అంతే దూరం లోకేష్” అంటూ తిరుపతి నుంచి ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్యాయత్నమని జోగి రమేష్ విమర్శించారు. ఈ దాడిని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు. రాష్ట్రంలో ‘జంగిల్ రాజ్’ (అరాచక పాలన) నడుస్తోందని, ప్రతిపక్ష నాయకులను భయపెట్టేందుకు పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇబ్రహీంపట్నంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం జోగి రమేష్ ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
#Jogi Ramesh #AndhraPradeshPolitics #Ibrahimpatnam #TDP #YSRCP #NaraLokesh #PoliticalViolence

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *