
అమరావతి, జూన్ 9: అమరావతి మహిళలను కించపరిచిన కేసులో సాక్షి ఛానెల్కు చెందిన జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావును (Journalist Kommineni Srinivas Rao) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో కొమ్మినేనిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాస్ రావు, కృష్ణం రాజులపై ఇప్పటికే కేసులు నమోదైన విషయం తెలిసిందే.
సోమవారం ఉదయం హైదరాబాద్లోని కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు (Andhra Pradesh Police) వెళ్ళారు. కొమ్మినేని తన కార్యాలయానికి వెళ్లే క్రమంలో బయటకు రాగా, ఆయనను ఆంధ్ర పోలీసులు నిర్బంధించారు.
పోలీసులు ఆయన్ను తిరిగి ఇంటిలోకి వెళ్ళనీయకుండా తుళ్ళూరుకు రావాలని కోరారు. అనంతరం కొమ్మినేనిని విజయవాడకు తరలించారు. ఎలాంటి నోటీసులు (notice) ఇవ్వకుండా పోలీసులు తనను నిర్బంధంలోకి తీసుకున్నారని, తన 50 ఏళ్ల జర్నలిజం చరిత్రలో ఇలాంటి సంఘటన మొదటిసారి చూస్తున్నానని కొమ్మినేని వ్యాఖ్యానించారు. రెడ్ బుక్ రాజ్యాంగం తన వరకూ కూడా వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను అమరావతి మహిళలను ఏ విధంగానూ కించ పరచలేదని, తనకు గానీ, తన సంస్థకు గానీ సంబంధం లేని అంశంలో తనను అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు.