Assam Assembly Elections 2026: కమలం వికసిస్తుందా?
ఆ 35 నియోజకవర్గాలే..కీలకం
గువాహటి: Assam Assembly Elections 2026 నేపథ్యంలో టీ తోట కార్మికుల ఓటు కీలకంగా మారింది. 35 నియోజకవర్గాలలో తేయాకు కార్మికులు చాలా ఎక్కువగా ఉంటారు. ఏ నాయకుడు గద్దె ఎక్కలన్నా… ఏ నాయకుడిని గద్దె దించాలన్నా ఈ ఓటరుల మద్దతు చాలా అవసరం. ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం చేసిన రెండు కీలక నిర్ణయాలు ఫలిస్తాయా? తేయాకు కార్మికుల కటాక్షాన్ని పొందుతాయా? అనే అంశం ప్రధాన చర్చనియాంశంగా మారుతోంది.
ఎన్నికల్లో బీజేపీ మళ్లీ ఆధిక్యం సాధించేందుకు కేవలం ఈ తేయాకు కార్మికులపైనే ఆశలు పెట్టుకుని ఉంది. అప్పర్ అసోంలో సుమారు 35 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలపై టీ తోట కార్మికుల ప్రభావం నిర్ణాయకంగా ఉంటుంది. వీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే ప్రతిపక్షాలు కూడా ఈ ఓటరులను ప్రసన్నం చేసుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంతలా ప్రభావితం చేసే ఆ నిర్ణయాలు ఏమింటంటే..
వేతన పెంపు: ఎన్నికల ముందు కీలక నిర్ణయం
ప్రస్తుతం టీ తోట కార్మికులకు రోజుకు రూ.250 వేతనం లభిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి అది రూ.280కు పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అసోం ఎన్నికల ముందు తీసుకున్న ఈ నిర్ణయం Assam Assembly Electionsలో కార్మికుల మద్దతు పొందేందుకు వ్యూహాత్మక చర్యగా భావిస్తున్నారు.
ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కార్మికులు రోజుకు రూ.500 వేతనం డిమాండ్ చేస్తున్నప్పటికీ, ప్రస్తుతం రూ.30 పెంపు పట్ల మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. ఎన్నికల ముందు ఈ పెంపు ఓటర్ల మూడ్పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
భూమి హక్కులు: రాజకీయంగా పెద్ద ప్రభావం
“మిషన్ బసుందరా” కింద టీ తోట కార్మిక కుటుంబాలకు భూమి లీజులు ఇవ్వడం మరో కీలక నిర్ణయం. అధికారిక గణాంకాల ప్రకారం 760 టీ తోటల్లో ఉన్న సుమారు 3.5 లక్షల కుటుంబాలకు భూమి హక్కులు లభించనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ విధానంలో లీజులు పంపిణీ చేశారు.
దాదాపు రెండు శతాబ్దాలుగా నివసిస్తున్న భూమిపై యాజమాన్య హక్కులు రావడం కార్మికుల్లో సానుకూల భావనను పెంచింది. ఇది ఎన్నికలలో బీజేపీకి రాజకీయ లాభం చేకూర్చుతుందా లేదా? అనే అనుమానాలు కలుతున్నాయి.
read this article also: పెట్రోల్, డీజిల్ ధరల భారీ తగ్గింపు
రూ. 30 పెంపుతో జీవితాలు మారుతాయా? : కాంగ్రెస్
ఎన్నికల నేపథ్యంలో టీ తోట కార్మికుల కోసం బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన వేతన పెంపు, భూమి హక్కుల నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తీసుకున్న రాజకీయ చర్యలుగా విమర్శిస్తోంది. రోజుకు రూ.250 నుంచి రూ.280కు పెంపు అంటే రూ. 30 మాత్రమే పెంచారని, జీవన వ్యయం దృష్ట్యా కనీస వేతనం రూ.500 ఉండాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. చిన్న పెంపుతో ఓట్లు కోరుతున్నారని, ఇది తాత్కాలిక చర్య మాత్రమేనని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.
ఇక మిషన్ బసుందరా కింద ఇచ్చే భూమి హక్కులు పూర్తి యాజమాన్యం కాదని, లీజ్ హక్కులకే పరిమితమని కాంగ్రెస్ అంటోంది. అలాగే టీ తోట కార్మికులకు షెడ్యూల్డ్ ట్రైబ్ హోదా హామీ ఇంకా అమలు కాలేదని, ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాల్లో మార్పు కనిపించడం లేదని విమర్శిస్తోంది. ఈ అంశాలను ముందుకు తెచ్చి శాసనసభ ఎన్నికలలో టీ తోట ఓటును బీజేపీ నుంచి దూరం చేయాలని కాంగ్రెస్ వ్యూహం.
కమలం మళ్లీ వికసిస్తుందా?
ప్రస్తుతం టీ తోట ప్రాంతాల్లో కనిపిస్తున్న వాతావరణం తమకు అనుకూలంగా ఉందని బీజేపీ భావిస్తోంది. వేతన పెంపు, భూమి హక్కులు వంటి నిర్ణయాలు కార్మికుల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచాయని ఆశతో ఉన్నారు. దీంతో ఎన్నికలలో టీ తోట ఓటు మళ్లీ కమలం వైపు మొగ్గుచూపుతుందా? .
అయితే పూర్తి ఆధిక్యం సాధించాలంటే బీజేపీ మరిన్ని సంక్షేమ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో కాంగ్రెస్ టీ తోట కార్మికులను తిరిగి తనవైపు తిప్పుకోవాలంటే బలమైన ప్రత్యామ్నాయ అజెండాతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

