March 25, 2026

ఏపీ టూరిజం.. సరికొత్త గమ్యం!

CM CHANDRABABU

CM CHANDRABABU

ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. పర్యాటక శాఖపై బుధవారం నిర్వహించిన సమీక్షలో 2029 నాటికి 50 వేల హోటల్ గదులు, 10 వేల హోం స్టేలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా నిర్దేశించారు. బారువ నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంత అభివృద్ధి, కారావాన్ పార్కులు, టెంట్ సిటీల ఏర్పాటు ద్వారా పర్యాటక రంగానికి పూర్వవైభవం తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పర్యాటక ప్రాజెక్టుల వేగవంతం కోసం సీఎస్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

రాష్ట్రానికి పెరుగుతున్న పర్యాటకుల రద్దీకి అనుగుణంగా వసతి సౌకర్యాలను మెరుగుపరచాలని సీఎం సూచించారు. జాతీయ, అంతర్జాతీయ హోటల్ బ్రాండ్లను ఆహ్వానించడంతో పాటు, స్థానికంగా హోం స్టేలను ప్రోత్సహించాలని తెలిపారు. ముఖ్యంగా గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం పరిసరాల్లో పెద్ద ఎత్తున హోం స్టేలు, వెయ్యికి పైగా టెంట్ సిటీలను సిద్ధం చేయాలని ఆదేశించారు. హోం స్టేల నిర్వహణలో నాణ్యత కోసం ప్రత్యేక రేటింగ్ విధానాన్ని తీసుకురావాలని స్పష్టం చేశారు.

పర్యాటకులు కుటుంబ సమేతంగా ప్రకృతిని ఆస్వాదించేందుకు అరకు, చింతపల్లి, మారేడుమిల్లి వంటి 15 ప్రాంతాల్లో కారావాన్ పార్కులను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే గండికోట, సూర్యలంక, బొర్రా గుహలను ఐకానిక్ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని చెప్పారు. విశాఖ, నెల్లూరు పోర్టుల నుంచి క్రూజ్ నౌకలను నిర్వహించడం ద్వారా ఇతర రాష్ట్రాల పర్యాటకులను సైతం ఆకర్షించవచ్చని, ఇందుకోసం సముద్ర విహారానికి పెద్దపీట వేయాలని సూచించారు.

ఉడాన్ పథకం కింద సీ ప్లేన్లను ప్రోత్సహించడంతో పాటు విజయవాడ, శ్రీశైలం, గండికోట వంటి చోట్ల వాటర్ ఏరోడ్రోమ్స్ ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. అమరావతిని ‘క్రియేటివ్ సిటీ’గా మార్చాలని, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వంటి వారు ఇక్కడ పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. తిరుపతి, విశాఖ నగరాలను ‘ఐకానిక్ డెస్టినేషన్’ స్కీమ్ కింద ఒక్కో దానికి రూ.500 కోట్లతో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రసాద్, స్వదేశ్ దర్శన్ పథకాల కింద చేపట్టిన దేవాలయాల అభివృద్ధి పనులను 2026 మే నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. చారిత్రక హావ్ లాక్ బ్రిడ్జిపైకి ఈ ఏడాది డిసెంబరు నాటికే పర్యాటకులను అనుమతించేలా పనులు ముగించాలని స్పష్టం చేశారు. అటవీ, దేవాదాయ శాఖల సమన్వయంతో ఎకో మరియు టెంపుల్ టూరిజాన్ని అనుసంధానించి, పర్యాటకుల సంఖ్యలో ప్రస్తుతం నమోదవుతున్న 21 శాతం వృద్ధిని మరింత పెంచాలని అధికారులకు పిలుపునిచ్చారు.

#APTourism #ChandrababuNaidu #AndhraPradesh #TravelAP #Araku #Vizag #Gandikota #Hospitality #GlobalTourism #NewAndhra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *