గండ్రపల్లిలో ‘విరూపాక్ష’ Cinema scene.. ఊరంతా ఖాళీ! ఎందుకంటే?
misterious deaths
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం ఇప్పుడు వెండితెరపై వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. జమ్మికుంట మండలం గండ్రపల్లిలో గత మూడు నెలలుగా జరుగుతున్న వరుస మరణాలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కేవలం 90 రోజుల వ్యవధిలో ఏకంగా 28 మంది ప్రాణాలు కోల్పోవడంతో, గ్రామానికి ఏదో కీడు సోకిందని నమ్మిన ప్రజలు సామూహికంగా ఊరు విడిచి వెళ్లడం సంచలనంగా మారింది. శాస్త్రీయ కారణాల కంటే దైవిక శక్తులపైనే భారం వేసిన గ్రామస్తులు, వినూత్న పద్ధతుల్లో పూజలు నిర్వహిస్తున్నారు.
మూడు నెలలు.. 28 మరణాలు
గండ్రపల్లిలో మరణ మృదంగం ఏ స్థాయిలో ఉందంటే, సగటున ప్రతి మూడు రోజులకు ఒకరు చనిపోతున్నారు. మరణించిన వారిలో కొందరు అనారోగ్య కారణాలతో ప్రాణాలు వదలగా, మరికొందరు ఊహించని రోడ్డు ప్రమాదాల్లో, ఇంకొందరు ఆత్మహత్యలకు పాల్పడి మృతి చెందారు. వరుసగా పాడెలు ఎదురవుతుండటంతో ఊరంతా విషాదంలో మునిగిపోయింది. సాధారణ మరణాలే అయినప్పటికీ, ఇంత తక్కువ కాలంలో ఇంతమంది చనిపోవడం వెనుక ఏదో అదృశ్య శక్తి ఉందనే భయం గూడు కట్టుకుంది.
ఊరంతా ఒక్కటై ‘కీడు’ వంటలు
గ్రామదేవతలకు మొక్కులు చెల్లించినా, జంతు బలులు ఇచ్చినా మరణాలు ఆగకపోవడంతో గ్రామస్థులు ఒక ఆధ్యాత్మిక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక పూజారి సలహా మేరకు ఊరంతా ఒక్కరోజు గృహాలను ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారు. తెల్లవారుజామునే డప్పు చాటింపు వేయించి, ఇళ్లకు తాళాలు వేసి పొలాల బాట పట్టారు. అక్కడ ‘కీడు వంటలు’ వండుకుని, పితృదేవతలకు నైవేద్యం పెట్టి భుజించారు. ఇలా చేయడం వల్ల గ్రామానికి పట్టిన పీడ విరగడవుతుందని వారు బలంగా నమ్ముతున్నారు
Read this article also: హైదరాబాద్ ఐటీ కోటకు బీటలు!
సినిమాను తలపిస్తున్న వాస్తవ పరిస్థితులు
ఈ పరిణామాలు చూస్తుంటే ప్రముఖ తెలుగు చిత్రం ‘విరూపాక్ష’లోని సన్నివేశాలు కళ్లముందు కదలాడుతున్నాయి. సినిమాలో లాగే ఇక్కడ కూడా గ్రామస్తులంతా ముకుమ్మడిగా ఊరు దాటి వెళ్లడం చర్చనీయాంశమైంది. సైన్స్ అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా ఇలాంటి నమ్మకాలు ఉండటం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ప్రాణ భయం ముందు మరేదీ ఎక్కువ కాదని గ్రామస్థులు వాదిస్తున్నారు. కీడు వంటల కార్యక్రమం తర్వాతైనా గ్రామంలో ప్రశాంతత నెలకొంటుందని వారు ఆశిస్తున్నారు.
అధికారుల స్పందన కోసం నిరీక్షణ
వరుస మరణాల వెనుక ఆరోగ్యపరమైన సమస్యలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో వైద్య ఆరోగ్య శాఖ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గ్రామంలోని నీటి వనరులు లేదా ఇతర కలుషితాల వల్ల అనారోగ్యాలు వస్తున్నాయా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు, ఈ మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరుతున్నారు. ఏది ఏమైనా, గండ్రపల్లిలో చోటుచేసుకున్న ఈ వింత ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.
Karimnagar #TelanganaNews #MysteryDeaths #Gandrapalli #Superstition #ViralNews #VillageRituals #TelanganaPolitics

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
