మధు పార్క్ రిడ్జ్ వాసులకు గుడ్ న్యూస్: ఎవరినీ రోడ్డున పడేయం.. రేవంత్
హైదరాబాద్: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ఇళ్లు కోల్పోతున్నామనే ఆందోళనలో ఉన్న బాధితులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా చర్చనీయాంశమైన ‘మధు పార్క్ రిడ్జ్’ అపార్ట్మెంట్ వాసుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, వారికి తగిన పునరావాసం మరియు నష్టపరిహారం కల్పిస్తామని స్పష్టం చేశారు. సోమవారం శాసనమండలిలో జరిగిన చర్చలో సీఎం ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
బఫర్ జోన్ నిబంధనలే కారణం..
మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ నిర్మాణం నాలా నిబంధనల ప్రకారమే జరిగినప్పటికీ, ప్రస్తుత నిబంధనల ప్రకారం అది మూసీ నది 50 మీటర్ల బఫర్ జోన్లోకి వస్తుందని సీఎం వివరించారు. ఈ బఫర్ జోన్ అపార్ట్మెంట్ మధ్య నుంచి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న వారికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. “ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి చేయడమే తప్ప, ప్రజలను నిరాశ్రయులను చేయడం కాదు” అని ఆయన పేర్కొన్నారు.
Read this article also అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: రేవంత్ సర్కార్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిప్పులు!
రాజకీయాల కోసం అడ్డుపడొద్దు..
మూసీ ప్రక్షాళన పనులను అడ్డుకుంటున్న ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలనే తాము అమలు చేస్తున్నామని, అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. నల్గొండ ప్రజలు మూసీ కాలుష్యం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలని, కేవలం రాజకీయాల కోసం ప్రాజెక్టును ఆపవద్దని కోరారు. ఏవైనా సూచనలు ఉంటే ఇవ్వాలని, వాటిని పరిశీలించడానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ల నేతృత్వంలో కమిటీ వేస్తామని ఆఫర్ ఇచ్చారు.
హైదరాబాద్ ట్రాఫిక్కు చెక్.. 4 ఎలివేటెడ్ కారిడార్లు!
నగర అభివృద్ధిపై ప్రసంగిస్తూ, హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం నాలుగు కొత్త ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించబోతోందని సీఎం వెల్లడించారు. దీనివల్ల సిటీలో రద్దీ తగ్గడమే కాకుండా, ఔటర్ రింగ్ రోడ్డు (ORR) మరియు రీజనల్ రింగ్ రోడ్డు (RRR) వరకు నగరం వేగంగా విస్తరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బాధితులు తమ అభిప్రాయాలను చెప్పవచ్చు..
మధు పార్క్ అపార్ట్మెంట్ వాసుల దగ్గరకు ప్రభుత్వ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు, ఆందోళన చెందకుండా తమ అభిప్రాయాలను మరియు సమస్యలను తెలియజేయాలని సీఎం సూచించారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని ఆయన సభ ముఖంగా హామీ ఇచ్చారు.

