
తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అనూహ్యంగా పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో, బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని కాషాయ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ నాయకులు బీజేపీపై చేస్తున్న విమర్శలను నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్ బీజేపీ అధ్యక్షులు నరేంద్ర చౌదరి, భిక్షపతి యాదవ్, ప్రసాద్ రాజులు తీవ్రంగా ఖండించారు. గురువారం నిజాంపేట్ కార్పొరేషన్లో జరిగిన జైహింద్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నాయకులందరికీ అందరికీ స్వాగతం పలుకుతున్నామని చెప్పారు.
అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో నిజాంపేట్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఒక్కసారి కూడా రాలేదని బీజేపీ నేతలు ఆరోపించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా నిజాంపేట్ కార్పొరేషన్కు రావడం, అది కూడా జాతీయ జెండాను పట్టుకుని తిరంగా యాత్రలో పాల్గొనేందుకు రావడం స్వాగతించదగిన పరిణామం అని వారు పేర్కొన్నారు.