
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ముప్పై యేళ్ళ తరువాత ఓ ఇంటివాడయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి చంద్రబాబు దంపతులు గృహప్రవేశం చేశారు. శివపురం గ్రామ పరిధిలో జాతీయ రహదారి పక్కన తన ఇంటిని ఆయన ఎకరా స్థలంలో నిర్మించుకున్నారు.
తర్వాత జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏకంగా 25 వేల మందికి పైగా భోజన ఏర్పాట్లు చేశారు. మహిళలకు పసుపు కుంకుమలతో చంద్రబాబు కుటుంబానికి ఆహ్వానం పలికారు.
చంద్రబాబు తన రాజకీయ జీవితం 95 శాతం కుప్పంతోనే ముడిపడి ఉంది. మూడు దశబ్ధాలకు పైగా ఇక్కడ నుంచే ఆయన శాసనసభకు ఎన్నిక అవుతున్నారు. కానీ, ఇక్కడ ఆయనకు స్థిర నివాసం లేదని ఆయనపై ప్రతిపక్షాలు ఎన్నోమార్లు విరుచుకుపడ్డాయి. ఆ వ్యాఖ్యలన్నింటికీ ఆయన సమాధానంగా శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ పరిధిలోని శివపురం గ్రామంలోని రెండు ఎకరాల భూమిలో నిర్మించబడింది.
శనివారం రాత్రి చంద్రబాబు కుటుంబంతో కలిసి కుప్పం చేరుకోగా, ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఇప్పటికే ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మధ్యాహ్నమే అక్కడికి చేరుకున్నారు. మంత్రి నారా లోకేష్, భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్తో కలిసి రాత్రి 8 గంటలకు కార్యక్రమానికి హాజరయ్యారు.