Oplus_131072
రాష్ట్రంలో సోలార్ పవర్ యూనిట్ల ఏర్పాటు కోసం సేకరించే భూములకు ఎకరాకు కనీసం రూ.30 వేల లీజు చెల్లించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల వల్ల కలిగే లబ్ధి కేవలం భూములు పొందిన అసలైన నిరుపేద లబ్ధిదారులకే చెందాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ‘ఫ్రీహోల్డ్’ పేరుతో జరిగిన భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. భూకబ్జాల నిరోధక చట్టం ద్వారా పెత్తందారుల దోపిడీకి చెక్ పెట్టాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
అసలైన లబ్ధిదారులకే న్యాయం జరగాలి
మెట్ట ప్రాంతాల్లో సాగుకు వీలులేక బీడుగా ఉన్న అసైన్డ్ భూములను సోలార్ ప్లాంట్ల కోసం తీసుకున్నప్పుడు, ఆ లీజు సొమ్ము నేరుగా పేద రైతులకే అందాలని సోమిరెడ్డి పేర్కొన్నారు. మధ్యలో భూములను దురాక్రమణ చేసిన వారికి లేదా అనధికారికంగా కొనుగోలు చేసిన వారికి ఈ లబ్ధి చేకూరకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించాలని సూచించారు. ఎకరాకు రూ.30 వేల లీజు లభిస్తే నిరుపేద కుటుంబాలకు స్థిరమైన ఉపాధి లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అసైన్డ్ భూముల క్రయవిక్రయాలపై విమర్శలు
అసైన్డ్ భూములను విక్రయించడం లేదా కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరమని సోమిరెడ్డి గుర్తు చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో గతంలో రూ.1-2 లక్షలకు కొనుగోలు చేసిన భూములను, పరిశ్రమలు వచ్చినప్పుడు ఎకరా రూ.50-60 లక్షలకు అమ్ముకుని కొందరు కోటీశ్వరులయ్యారని ధ్వజమెత్తారు. అమాయక గిరిజనుల భూములను తక్కువకు లాక్కుని, ప్రాజెక్టులకు భారీ ధరలకు విక్రయించిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఫ్రీహోల్డ్ అక్రమాలపై విచారణకు డిమాండ్
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ‘ఫ్రీహోల్డ్’ విధానాన్ని అడ్డం పెట్టుకుని అధికార పార్టీ నేతలు భారీగా భూదందాలకు పాల్పడ్డారని సోమిరెడ్డి ఆరోపించారు. పేదల నుంచి తక్కువ ధరకే భూములను కాజేసి, వాటిని ఫ్రీహోల్డ్ చేయించుకుని అధిక ధరలకు విక్రయించారని విమర్శించారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ భూ అక్రమాలపై రెవెన్యూ మంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
#Somireddy #APAssembly #SolarEnergy #FarmersRights #AndhraPradesh #LandGrabbingAct #Sarvepalli #TeluguNews
