తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి ప్రసాదం విషయంలో జరిగిన అపచారం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని, దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీఏ నేతలతో భేటీ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన గత పాలకులు చేసిన తప్పిదాలను ఎండగట్టారు.
కల్తీ నెయ్యితో మహా పాపం.. పక్కా ఆధారాలతోనే సిట్ దర్యాప్తు
గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు, రసాయనాలు, పామాయిల్ ఉన్నట్లు ఎన్డీడీబీ (NDDB) పరీక్షల్లో తేలిందని సీఎం వెల్లడించారు. 2022లోనే సీఎఫ్టీఆర్ఐ నివేదిక కల్తీ జరుగుతోందని హెచ్చరించినా, గత పాలకులు స్వార్థ ప్రయోజనాల కోసం దానిని తొక్కిపెట్టారని ఆరోపించారు. శ్రీవారిపై భక్తి లేని వ్యక్తులు కేవలం దోపిడీ లక్ష్యంగా వ్యవహరించి, పవిత్రమైన లడ్డూను అపవిత్రం చేశారని మండిపడ్డారు.
టీటీడీ బోర్డు మాజీ చైర్మన్, పర్చేజ్ కమిటీకి తెలిసే ఈ అక్రమాలు జరిగాయని, చైర్మన్ పీఏ స్థాయి వ్యక్తి రూ.4 కోట్ల లంచం తీసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. సిట్ (SIT) నివేదిక ప్రకారం ప్రతిదీ ఆధారాలతో సహా బయటపడిందని, కరడుగట్టిన నేరస్తులు అబద్ధాలను నిజం చేసేందుకు ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
సంప్రదాయాల ఉల్లంఘన.. డిక్లరేషన్ అడిగితే తప్పా?
తిరుమల నిబంధనల ప్రకారం అన్యమతస్తులు డిక్లరేషన్పై సంతకం చేయాల్సిందేనని, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వంటి వారే నిబంధనలను గౌరవించారని సీఎం గుర్తుచేశారు. కానీ, గత పాలకులకు వేంకటేశ్వర స్వామిపై నమ్మకం లేకపోవడం వల్లే డిక్లరేషన్ ఇచ్చేందుకు నిరాకరించారని విమర్శించారు. గతంలో అంతర్వేది రథం దగ్ధం, రామతీర్థం విగ్రహాల ధ్వంసం వంటి ఘటనల్లోనూ ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
2003లో క్లైమోర్ మైన్స్ దాడి నుంచి తను ప్రాణాలతో బయటపడటం శ్రీవారి కృపేనని, ఏడుకొండల స్వామి తనకు పునర్జన్మ ప్రసాదించారని భావోద్వేగంగా మాట్లాడారు. అటువంటి స్వామివారి పవిత్రతను కాపాడటం తన బాధ్యతని, భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి అపచారం చేయాలంటే భయపడేలా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుమల ప్రక్షాళన ఇప్పటికే ప్రారంభమైందని, భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
#Tirumala #LadduControversy #ChandrababuNaidu #TTD #AndhraPradesh #SpiritualPurity #JusticeForDevotees
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.