March 23, 2026

రాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచక పాలన: విడదల రజిని ధ్వజం

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కనుమరుగయ్యాయని, కేవలం ‘రెడ్‌బుక్’ పాలన మాత్రమే నడుస్తోందని విడదల రజిని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “మళ్లీ వస్తాం.. మళ్లీ కొడతాం” అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు బాహాటంగా బెదిరింపులకు దిగడం ఏ సంస్కృతికి నిదర్శనమని ఆమె ప్రశ్నించారు. కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులు చేయిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలను విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు.

లడ్డూ వ్యవహారం నుంచి దృష్టి మళ్లించేందుకే దాడులు

తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో జరగని కల్తీని జరిగినట్లుగా చిత్రీకరించి దుష్ప్రచారం చేశారని రజిని ఆరోపించారు. ఈ అంశంపై కూటమి నేతలను తాము నిలదీస్తుండటంతో, ఆ విషయం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వైఎస్సార్‌సీపీ నేతలపై భౌతిక దాడులకు దిగుతున్నారని విమర్శించారు. తమపై దాడులు చేయడమే కాకుండా, తిరిగి బాధితులపైనే అక్రమ కేసులు పెట్టడం ఈ ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట అని ఆమె ధ్వజమెత్తారు.

వైఎస్సార్‌సీపీ నేతలు గుడికి వెళ్లకూడదని చట్టం చేస్తారా?

కూటమి పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని దైవదర్శనం చేసుకుంటే దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని విడదల రజిని నిలదీశారు. వైఎస్సార్‌సీపీ వాళ్లు ఏ గుడికి వెళ్లకూడదని కొత్తగా ఏదైనా చట్టం చేస్తారా అని ఎద్దేవా చేశారు. తమపై జరిగిన దాడుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం స్పందన లేదని, యంత్రాంగం కూడా అధికార పార్టీకి కొమ్ముకాస్తోందని విమర్శించారు. వేంకటేశ్వరస్వామితో పెట్టుకున్న వారికి ఏ గతి పడుతుందో గతంలోనే నిరూపితమైందని ఆమె హెచ్చరించారు.

ప్రజల పక్షాన పోరాటం ఆగదు

ఎన్ని దాడులు చేసినా, అక్రమ కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని విడదల రజిని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఎండగడతామని తెలిపారు. మహిళా పక్షపాతినని చెప్పుకుంటూనే, మహిళా నేతలపై దాడులు చేయించడం టీడీపీ ద్వంద్వ నీతికి నిదర్శనమని విమర్శించారు. ఈ ఆటవిక పాలనపై ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని ఆమె హెచ్చరించారు.

#VidadalaRajini #YSRCP #TDP #AndhraPradesh #RedBookPolitics #Tadepalli #APNews #PoliticalAttacks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *